ఆసియా కప్ 2025 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా బుధవారం యూఏఈతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి రెండో జట్టుగా పాకిస్థాన్ సూపర్-4కు అర్హత సాధించింది. దాంతో సూపర్-4లో భారత్తో మరోసారి పాకిస్థాన్ తలపడనుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఫకార్ జమాన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. షాహిన్ షా అఫ్రిది(14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్(4/14) నాలుగు వికెట్లు తీయగా.. సిమ్రంజిత్ సింగ్(3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. ధ్రువ్ పరషార్ ఒక వికెట్ తీసాడు. ఆఖరి ఓవర్లో షాహిన్ షా అఫ్రిది దూకుడుగా ఆడి 18 పరుగులు పిండుకోవడం పాకిస్థాన్కు కలిసొచ్చింది. ఈ ఓవరే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.

అనంతరం యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా(35 బంతుల్లో ఫోర్, సిక్స్తో 35), ధ్రువ్ పరాషర్(23 బంతుల్లో ఫోర్తో 20) టాప్ స్కోరర్గా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/16), హ్యారీస్ రౌఫ్(2/19), అబ్రర్ అహ్మద్(2/13) రెండేసి వికెట్లు తీయగా.. సైమ్ అయుబ్, సల్మాన్ అఘా చెరో వికెట్ పడగొట్టారు.