ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో ఐదు రోజుల్లో ఈ టోర్నీకి తెరలేవనుంది. సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో ప్రారంభం కానుంది. ఆతిథ్య యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, అఫ్గానిస్థాన్ జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. యూఏఈ, పాకిస్థాన్, ఒమన్తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది.
లీగ్ దశలో ప్రతీ జట్టు ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. నాలుగు జట్లు మరోసారి ఒక్కోసారి తలపడుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన ఆయా దేశాలు సన్నాహకాలు కూడా ప్రారంభించాయి. యూఏఈ, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ జట్లు సన్నాహకంగా ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతిలో ఉన్న భారత జట్టు మాత్రం ఇంకా సన్నాహకాలు మొదలుపెట్టలేదు.

మరో రెండు రోజుల్లో టీమిండియా యూఏఈకి చేరనుంది. తొలి మ్యాచ్ను యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనున్న భారత్.. సెప్టెంబర్ 14న దాయాదీ పాకిస్థాన్తో తలపడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్, భారత్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే మూడు సార్లు తలపడుతాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ టోర్నీలో గెలిచే జట్టుకు రూ. 2.6 కోట్ల ప్రైజ్మనీని లభించనుంది. రన్నరప్ జట్టుకు రూ. 1.3 కోట్లు దక్కనుంది. 2022లో చివరిసారిగా టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరగ్గా.. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రీలంకకు రూ. 1.6 కోట్లు ప్రైజ్మనీగా లభించింది. తాజా ఎడిషన్ ప్రైజ్మనీని 50 శాతం పెంచేసారు. రన్నరప్ అయిన పాకిస్థాన్కు అప్పుడు రూ. 80 లక్షల ప్రైజ్మనీ దక్కగా.. తాజాగా ఎడిషన్లో డబుల్ చేశారు. మూడు, నాలుగో స్థానంలో నిలిచిన జట్లకు అప్పుడు రూ. 62 లక్షలు, రూ. 44 లక్షలు దక్కగా దక్కగా ఈ సారి భారీ మొత్తంలో దక్కే అవకాశం ఉంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు రూ. 4.34 లక్షలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు రూ. 13 లక్షలు అందజేయనున్నారు. ఆసియా కప్ 2025 ప్రైజ్మనీకి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.