ఆసియా కప్ 2025 టోర్నీలో శ్రీలంక దుమ్మురేపుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి సూపర్ -4 అవకాశాలను మెరుగుపరుచుకుంది. సోమవారం హాంగ్ కాంగ్తో జరిగిన రెండో మ్యాచ్లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. హాంగ్ కాంగ్ చెత్త ఫీల్డింగ్ కూడా శ్రీలంకకు కలిసొచ్చింది. ఈ టోర్నీలో హాంగ్ కాంగ్ ఏకంగా 11 క్యాచ్లను నేలపాలు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఓపెనర్ అన్షీ రత్(46 బంతుల్లో 4 ఫోర్లతో 48), నిజకత్ ఖాన్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 52 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత్ చమీరా(2/29) రెండు వికెట్లు తీయగా.. వానిందు హసరంగా, డసన్ షనక తలో వికెట్ తీసారు.
అనంతరం శ్రీలంక 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ పెరెరా(16 బంతుల్లో ఫోర్, సిక్స్తో 20 ), వానిందు హసరంగా(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

చరిత్ అసలంక(2), కామిందు మెండిస్(5) వెను వెంటనే ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ హసరంగా భారీ షాట్లతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, అజైజ్ ఖాన్, ఇషాన్ కిషన్ చెరో వికెట్ తీయగా.. యాసిమ్ ముర్తాజా(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మూడింటికి మూడు మ్యాచ్లు ఓడిన హాంగ్ కాంగ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.