ఆసియా కప్ 2025 సీజన్లో భాగంగా భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన పాకిస్థాన్ ప్రాక్టీస్ సెషన్కు సల్మాన్ అలీ అఘా దూరంగా ఉన్నాడు. అతను మెడ నొప్పితో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. జట్టుతో కలిసి దుబాయ్లోని ఐసీసీ క్రికెట్ అకాడమీకి వచ్చినప్పటికీ.. మెడకు బ్యాండేజ్ వేసుకొని కనిపించాడు. దాంతో అతని ఫిట్నెస్పై సందేహాలు మొదలయ్యాయి.
ప్రాక్టీస్ సెషన్కు సల్మాన్ అలీ అఘా దూరంగా ఉన్నాడని, అతని సహచరులు మాత్రం వార్మప్, స్ట్రెచింగ్ డ్రిల్స్తో పాటు ఫుట్బాల్ ఆడారని పాకిస్థాన్కు చెందిన ఓ ఛానెల్ పేర్కొంది. సల్మాన్ అలీ అఘా అసౌకర్యంగా కనిపించాడని, ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడని తెలిపింది. అయితే సల్మాన్ అలీ అఘాకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని, అతని మెడ నొప్పి చిన్నదేనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మీడియా మేనేజర్ వివరణ ఇచ్చారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే అతను విశ్రాంతి తీసుకున్నాడని, శుక్రవారం ఒమన్తో జరిగే మ్యాచ్లో అతను బరిలోకి దిగుతాడని తెలిపాడు. ఆసియా కప్లోని అన్ని మ్యాచ్లకు అతను అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు.

ఆసియా కప్ 2025 టోర్నీకి సన్నాహకంగా జరిగిన ట్రై సిరీస్లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో అఫ్గాన్ను 75 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ సిరీస్లో యూఏఈ కూడా ఆడగా.. మహమ్మద్ నవాజ్ హ్యాట్రిక్ వికెట్తో సంచలన విజయాన్నందించాడు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 8వ స్థానంలో ఉన్న పాకిస్థాన్.. సెప్టెంబర్ 14న తమ చిరకాల ప్రత్యర్థి భారత్తో తలపడనుంది. ఈ హై-ఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యూఏఈ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండటం పాకిస్థాన్కు కలిసిరానుంది. ప్రస్తుతం పాక్ స్పిన్నర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్, పాక్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.