చప్పగా సాగుతున్న ఆసియా కప్ 2025 టోర్నీని హీటెక్కిస్తుందని భావించిన భారత్-పాక్ పోరు తీవ్రంగా నిరాశపర్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ జట్టు దారుణంగా విఫలమైంది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులే చేసింది.
షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో ఏడు ఫోర్లు, ఏడు సిక్స్లు మాత్రమే నమోదవ్వడం గమనార్హం. ఓ దశలో పాక్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ షాహిన్ షా అఫ్రీది దూకుడుగా ఆడి పాక్కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ సైమ్ అయుబ్(0) డకౌట్గా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన మరుసటి ఓవర్లో మొహమ్మద్ హ్యారీస్(3) క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. బుమ్రా బౌలింగ్లో రెండు సిక్సలు బాదాడు. దాంతో పవర్ ప్లేలో పాకిస్థాన్ 2 వికెట్లకు 42 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం కెప్టెన్ సూర్య స్పిన్నర్లను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు.
అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్లో ఫకార్ జమాన్(17) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వరుణ్ చక్రవర్తీ మరుసటి ఓవర్లో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా వికెట్ల ముందు దొరికినా.. రివ్యూతో బచాయించాడు. కానీ అతన్ని అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్థాన్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లకు 49 పరుగులే చేసింది.
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఆచితూచి ఆడిన ఫర్హాన్ భారీ షాట్స్లో వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. కానీ మరో ఎండ్లో హసన్ నవాజ్(5), మహమ్మద్ నవాజ్(0)లను కుల్దీప్ యాదవ్ వరుసగా పెవిలియన్ చేర్చాడు. అక్షర్ బౌలింగ్లో ఫర్హాన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎల్బీ విషయంలో రివ్యూ తీసుకొని బచాయించాడు. ఆచితూచి ఆడిన అతన్ని కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన షాహీన్ షా అఫ్రిది భారీ సిక్సర్లతో ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. కానీ ఫహీమ్ అష్రఫ్(11)ను వరుణ్ చక్రవర్తీ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అయినా వెనక్కి తగ్గని షాహీన్ షా అఫ్రీది దూకుడుగా ఆడి జట్టు స్కోర్ను 120 ధాటించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు. దాంతో ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.