ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది. ఈ రోజు వాతావరణం కూడా ఉక్కపోతగా కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో మంచు కురిసే అవకాశం ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా అందుకు సిద్దంగా ఉన్నాం. కానీ ఈ రోజు ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. యూఏఈకి చాలా ముందుగానే వచ్చాం. 3-4 ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నాం. ఒక రోజు విశ్రాంతి కూడా తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వరుసగా 15 అంతర్జాతీయ మ్యాచ్ల తర్వాత టీమిండియా టాస్ గెలించింది.

గత 15 మ్యాచ్ల్లో భారత్ వరుసగా టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడినే తీసుకున్న టీమిండియా మేనేజ్మెంట్... హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబేను కూడా బరిలోకి దించింది. అందరూ ఊహించినట్లుగానే సంజూ శాంసన్కు వికెట్ కీపర్గా అవకాశం దక్కగా.. రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్ ఉద్వాసనకు గురయ్యారు. తుది జట్టు గురించి సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ కొత్తగా ఉంది.ఆరంభంలో బంతి బౌలింగ్కు అనుకూలంగా ఉండనుంది. ఈ టోర్నీకి ముందు మేం మంచి సిరీస్ ఆడాం. మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఆ సిరీస్ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మేం స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు, జూనియర్లు, సీనియర్లతో కూడిన కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నాం.'అని చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.
యూఏఈ: ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా(కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్