భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ పోరు కోసం ఆసక్తికరంగా చూస్తూ ఉంటోంది. భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందంటే.. క్రికెట్ ప్రపంచమే టీవీల ముందు వాలిపోతుంది. కేవలం బ్యాట్, బంతి మధ్య జరిగే పోరు కాదు ఇది.. ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఇరు దేశాల అస్తిత్వానికి, గౌరవానికి ప్రతీక ఈ పోరు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న జరిగే భారత్-పాక్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను క్యాష్ చేసుకునే పనిలో నిర్వాహకులు, బ్రాడ్కాస్టర్స్ పడ్డాయి. ఇప్పటికే అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ నెట్వర్క్ ఆసియా కప్ 2025కు సంబంధించిన యాడ్ టారిఫ్స్ను భారీగా పెంచేసింది. 10 సెకన్ల యాడ్కు రూ. 16 లక్షల వసూలు చేస్తోంది. భారత్, పాక్ మ్యాచ్కు ఈ రేట్లు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ ప్రారంభ ధర రూ. 11, 000గా నిర్ణయించారు. ఈ టికెట్లను దుబాయ్, అబుదాబి క్రికెట్ స్టేడియాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు ప్రకటించారు.

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. భారత్తో పాటు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ దేశాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూప్స్గా విభజించారు. భారత్, పాక్, ఒమన్, యూఏఈ గ్రూప్-ఏలో ఉన్నాయి. సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 14న పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విక్రయాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం ప్రారంభించింది. టికెట్ల విక్రయాలను 3 విభాగాలుగా విభజించింది. లీగ్ దశ మ్యాచ్ల టికెట్ల ప్రారంభ ధర రూ. 11 వేలుగా.. సూపర్ 4 మ్యాచ్ల టికెట్ల ప్రారంభ ధర రూ. 12,500, నాకౌట్, ఫైనల్ మ్యాచ్ల టికెట్ల ప్రారంభ ధర కూడా 12500గా నిర్ణయించారు.
ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలను ఆయా దేశాలు ప్రకటించాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కలేదు.