ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్తో మ్యాచ్లో టీమిండియా మ్యూజికల్ బ్యాటింగ్ చేసింది. జట్టులో ఉన్న ఆటగాళ్ల అందరూ బ్యాటింగ్ చేయాలనే కాన్సెప్ట్తో సరదాగా ఆడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మినహా జట్టులో ఉన్న ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేశారు. వచ్చినోళ్లు వచ్చినట్లు భారీ షాట్లకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు పరుగులు రాబడితే మరికొందరు నిరాశగా వెనుదిరిగారు.
మ్యూజికల్ చైర్ గేమ్ తరహాలో సాగిన భారత బ్యాటింగ్లో సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 56) కాస్త నిదానంగా ఆడి హాఫ్ సెంచరీ బాదాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38) తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. అక్షర్ పటేల్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న స్లో వికెట్పై భారత బ్యాటర్లు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు.

ఓపెనర్ శుభ్మన్ గిల్(5), ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా(1), శివమ్ దూబే(5) తీవ్రంగా నిరాశపర్చగా.. అర్ష్దీప్ సింగ్(1) రనౌటయ్యాడు. హర్షిత రాణా(13 నాటౌట్), కుల్దీప్ యాదవ్(1 నాటౌట్) అజేయంగా నిలిచారు. సంజూతో కలిసి అభిషేక్ శర్మ రెండో వికెట్కు 66 పరుగులు జోడించగా.. అక్షర్ పటేల్తో కలిసి సంజూ నాలుగో వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. తిలక్ వర్మతో 41 పరుగులు జోడించి సంజూ వెనుదిరిగాడు.
ఒమన్ బౌలర్లలో షా ఫైసల్(2/23), జితేన్(2/33), అమీర్ కలీమ్(2/31) రెండేసి వికెట్లు తీసారు. దురదృష్టకర రీతిలో హార్దిక్ పాండ్యా రనౌటయ్యాడు. ఈ మ్యాచ్ను భారత్ పూర్తిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వాడుకుంది. నెట్స్లో ఆడినట్లే అనిపించింది. గల్లీ క్రికెట్ తరహాలో అందరికి బ్యాటింగ్ రావాలనే కాన్సెప్ట్ కనిపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.