టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ ఇద్దరి మ్యాచ్ ఫీజులో 30 శాతం చొప్పున కోత విధించింది. ఈ ఇద్దరూ ఐసీసీ రూల్స్ను ఉల్లంఘించారని ఐసీసీ భావించింది. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విజయాన్ని సూర్యకుమార్ యాదవ్ భారత సాయుధ బలగాలకు అంకితమిచ్చాడు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు టీమిండియా ఎప్పుడూ అండగా ఉంటుందని, ఐసీసీ, ఏసీసీ టోర్నీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నామనే విషయాన్ని వెల్లడించాడు. అయితే సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ కామెంట్స్ అని, ఐసీసీ రూల్స్కు విరుద్దమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఫిర్యాదు చేసింది.

విచారణ జరిపిన ఐసీసీ.. సూర్యను వివరణ కోరగా తాను ఏ తప్పిదం చేయలేదని స్పష్టం చేశాడు. దాంతో రూల్స్ ప్రకారం అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. టీ20ల్లో టీమిండియా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుగా రూ. 3 లక్షలను బీసీసీఐ చెల్లిస్తుంది. ఈ లెక్క ప్రకారం సూర్య మ్యాచ్ ఫీజులో రూ.90 వేలు కోత పడనుంది. అయితే బీసీసీఐ ఆదేశాల మేరకే సూర్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ డబ్బులను బీసీసీఐ చెల్లించే ఛాన్స్ ఉంది.
ఇదే టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్లో హరీస్ రౌఫ్ వివాదాస్పద సంజ్ఞలు చేశాడు. భారత అభిమానులను రెచ్చగొట్టేలా.. భారత జెట్ విమానాలను కూల్చామని, 6-0 అంటూ సైగలు చేశాడు. అతని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో ఐసీసీ విచారణ చేపట్టి వివరణ కోరింది. 6-0 సంజ్ఞకు అర్థం ఏంటని హరీస్ రౌఫ్ను ప్రశ్నించగా.. తాను భారత్ను ఉద్దేశించి ఆ సైగలు చేయలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మైదానంలో అతని వివాదాస్పద వ్యవహార శైలిని మందలించిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది.
ఇదే మ్యాచ్లో హాఫ్ సెంచరీ అనంతరం గన్ ఎక్కుపెట్టి సంబరాలు చేసుకున్న పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద్ ఫర్హాన్ను ఐసీసీ వార్నింగ్తో వదిలిపెట్టింది. తన సంబరాల వెనుక ఎలాంటి రాజకీయపరమైన ఉద్దేశం లేదని, గతంలో ధోనీ, కోహ్లీ కూడా ఇలా సంబరాలు చేసుకున్నారని ఫర్హాన్ ఐసీసీకి వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ జరిమానాల గురించి ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.