ఆసియా కప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో హాంగ్ కాంగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అఫ్గానిస్థాన్ చేతిలో చెత్త బ్యాటింగ్తో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న హాంగ్ కాంగ్.. బంగ్లాదేశ్ ముందు 144 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది.
ఓపెనర్ జీషన్ అలీ(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30), నిజకత్ ఖాన్(40 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 42) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ యసిమ్ ముర్తాజా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28) మెరుగైన ప్రదర్శన చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, రిషద్ హొస్సేన్ రెండేసి వికెట్లు తీసారు. టీ20ల్లో ఇది తక్కువ స్కోరే అయినా.. హాంగ్ కాంగ్ స్థాయికి ఇది గొప్ప లక్ష్యమేనని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హాంగ్ కాంగ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అన్షీ రాత్(4) రెండో ఓవర్లోనే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన బబర్ హయత్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. తంజీమ్ హసన్ షకీబ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో హాంగ్ కాంగ్ 2 వికెట్లకు 34 పరుగులే చేసింది.
అనంతరం నిజకత్ ఖాన్తో కలిసి దూకుడుగా ఆడిన జీషన్ అలీ వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే అతన్ని తంజీమ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ యాసిమ్ ముర్తాజా, నిజకత్ ఖాన్ వేగంగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న యాసిమ్ ముర్తాజా రనౌట్ కావడంతో నాలుగో వికెట్కు నమోదైన 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన నిజకత్ ఖాన్ను రిషద్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో హాంగ్ కాంగ్ 143 పరుగులకే పరిమితమైంది.