ఆసియా కప్ 2025 టోర్నీ తుది పోరుకు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్థాన్ను రెండు సార్లు చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు కనీసం ఫైనల్లో అయినా ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని దాయాదీ పాకిస్థాన్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉందా? వర్షంతో మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? అనే సందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి.
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోతే.. సోమవారం మ్యాచ్ జరుగుతుంది. ఎక్కడ మ్యాచ్ ఆగిపోతే అక్కడి నుంచే తిరిగి ప్రారంభమవుతుంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే.. టోర్నీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు.

అయితే ఈ మ్యాచ్కు ఎలాంటి వర్ష సూచన లేదు. దుబాయ్లో వాతావరణం బాగుంది. ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కానున్నాయి. వర్షం పడే ఛాన్స్ ఏ మాత్రం లేదు. ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
తీవ్ర వివాదాల మధ్యే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో విజయానంతరం టీమిండియా ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి డోర్ చేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే విషయాన్ని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ పరోక్షంగా వెల్లడించాడు.
అంతేకాకుండా ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు టీమిండియా అండగా ఉంటుందని, సంఘీభావం కూడా తెలిపాడు. ఐసీసీ, ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నామనే విషయాన్ని తన మాటల ద్వారా స్పష్టం చేశాడు.