ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ తెలిపాడు. ' మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇది మేం తప్పక గెలవాల్సిన మ్యాచ్. వికెట్ కాస్త నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తోంది. 160 పరుగుల లక్ష్యం కూడా మంచి స్కోర్ అవుతుంది.
బ్యాటింగ్కు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఆట సాగుతున్నా కొద్దీ పిచ్ నెమ్మదిగా మారవచ్చు. ప్రస్తుతం జట్టు మంచి మూడ్లో ఉంది. గత కొన్ని నెలలుగా మేం మెరుగైన ప్రదర్శన చేస్తున్నాం. గత మ్యాచ్ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మేం తుది జట్టులో నాలుగు మార్పులు చేశాం. టస్కిన్ తిరిగి రాగా.. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నాం.'అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నామని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. అయితే టీ20ల్లో ముందు బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఒరిగే ప్రయోజనం ఏం ఉండదన్నాడు. తమ ఆటగాళ్లకు మూడు రోజులు మంచి విశ్రాంతి లభించిందని, మంచి ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగిందని తెలిపాడు. తమ ప్రధాన బలం బౌలింగ్ విభాగమని, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ అని చెప్పుకొచ్చాడు.
తమ బౌలింగ్ ఇంకా మెరుగవ్వాలని, సమష్టిగా రాణించాలని, సరైన ప్రదేశంలో నిలకడగా బంతులు సంధించాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ మ్యాచ్ను ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇరు జట్లు హాంగ్ కాంగ్పై చెరో విజయాన్ని నమోదు చేశాయి. అయితే బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో ఓడింది. సూపర్ 4 చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు కీలకం.
బంగ్లాదేశ్ : తన్జిద్ హసన్ తమీమ్, సైఫ్ హసన్, లిటన్ దాస్(కీపర్/కెప్టెన్), తౌహిద్ హృదయ్, నసుమ్ అహ్మద్, నూరుల్ హసన్, జాకర్ అలీ, షమీమ్ హుస్సేన్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్.
అఫ్గానిస్తాన్: సెదికుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాజీ, కరీమ్ జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, ఎ.ఎం. గజన్ఫర్, ఫజల్హక్ ఫారూఖీ.