ఆసియా కప్ 2025 టోర్నీని భారత్ ఘనంగా ప్రారంభించింది. పసికూన యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో రికార్డ్ విజయాన్నందుకుంది. వరల్డ్ ఛాంపియన్గా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్.. తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్తో తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యం ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ పోరును ఓ సాధారణ క్రికెట్ మ్యాచ్గా కాకుండా ఇరు దేశాల మధ్య యుద్దంలా అభిమానులు పరిగణించనున్నారు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉండనుంది.
యూఏఈతో మ్యాచ్ను సన్నాహకంగా ఉపయోగించుకున్న భారత్.. పాకిస్థాన్తో కూడా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ డెప్త్ కోసం ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేతో టీమిండియా బరిలోకి దిగింది. అనూహ్యంగా శివమ్ దూబే(3/4) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో ఇదే కాంబినేషన్ను కొనసాగించనున్నారు. ఒకవేళ ఎక్స్ట్రా స్పెషలిస్ట్ బౌలర్ కావాలనుకుంటే మాత్రం అర్ష్దీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు తిలక్ వర్మ లేదా వరుణ్ చక్రవర్తీపై వేటు పడుతుంది. కానీ స్పిన్కు అనుకూలంగా ఉండే దుబాయ్ వికెట్లపై టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ దుమ్మురేపారు. విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్లో ఆడనుండగా.. నాలుగో స్థానంలో తిలక్ వర్మ, ఐదో స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఆడనున్నాడు. ఇదే కాంబినేషన్ కొనసాగిస్తే అర్ష్దీప్ సింగ్తో పాటు రింకూ సింగ్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా మరోసారి బెంచ్కే పరిమితం కానున్నారు.
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా.