ఆసియా కప్ 2025 టోర్నీని భారత్ ఘనంగా ప్రారంభించింది. పసికూన యూఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్లో నిప్పులు చెరిగిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్లో బౌండరీల మోత మోగించింది. టీ20ల్లో వరల్డ్ ఛాంపియన్ అయిన భారత్కు యూఏఈ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్తో యూఏఈ పతనాన్ని శాసించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు. అభిషేక్, గిల్ ధాటికి 93 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది.
58 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సిక్స్ తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. హైదర్ అలీ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతినే స్టేడియం బయటకు పంపించాడు. ఆ మరుసటి బంతిని బౌండరీ తరలించాడు. ఆ తర్వాతి నాలుగు బంతులు డాట్ కావడంతో తొలి ఓవర్లోనే 10 పరుగులు వచ్చాయి. ముహమద్ రోహిద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో శుభ్మన్ గిల్ ఓ బౌండరీతో పాటు సిక్సర్ బాదాడు. ధ్రువ్ పరాశర్ వేసిన మూడో ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా 6, 4 బాదడంతో టీమిండియా 3 ఓవర్లలోనే 38 పరుగులు చేసింది.
జునైద్ సిద్దిఖీ వేసిన నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మ ఓ భారీ సిక్స్ బాది అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్గా మలిచాడు. సిమర్జిత్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని శుభ్మన్ గిల్ బౌండరీ బాది భారత విజయాలాంఛనాన్ని పూర్తి చేశాడు.