హైదరాబాద్: ఆసియాకప్ 2023 ఆరంభం అట్టర్ ప్లాఫ్ అయ్యింది. వన్డే ప్రపంచకప్కు ముందు టీజర్లా జరుగుతున్న ఈ మినీ సమరానికి అభిమానుల నుంచి స్పందన కరువైంది.
మెగా టోర్నీకి ముందు టీమ్ కాంబినేషన్ను సరిచూసుకోవడానికి, లోపాలను సవరించుకోవడానికి, బలాబలాలను అంచనా వేసుకోవడానికి, ఎంతో విలువైన ప్రాక్టీస్ను పొందడానికి ఆసియా జట్లకు ఈ టోర్నీ ఓ చక్కని అవకాశంగా భావిస్తుంటే.. అభిమానులు మాత్రం ఈ టోర్నీ ఆరంభం వేడుకలపై కన్నెత్తి కూడా చూడలేదు.

15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్లో ఆసియా కప్ మ్యాచ్ జరగ్గా.. స్టేడియానికి 3 వేల మంది కూడా రాలేదు. సొంత దేశానికి చెందిన స్టార్ క్రికెటర్లు ఆడుతున్నా వారిని చూసేందుకు కూడా అభిమానులు ముఖం చాటేసారు.
ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్, పసికూన జపాన్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. 30 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన ముల్తాన్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. కానీ ప్రేక్షకులు లేక స్టేడియం బోసిపోయింది. స్టాండ్స్ అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ఆరంభ వేడుకలు కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయి. పాకిస్థాన్ సింగర్ అయిమా బైగ్, నేపాలి సింగర్ త్రిషలా గురంగ్ తమ పాటలతో సందడి చేసినా.. విని ఆనందించేందుకు అభిమానులే లేరు. కాస్తో కూస్తో నేపాల్ అభిమానులు మైదానంలో సందడి చేశారు. ఆటపై తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.
టోర్నీ ఆరంభాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ జట్టు తొలి మ్యాచ్కు అభిమానులను రప్పించలేకపోయారని విమర్శిస్తున్నారు. జింబాబ్వే వంటి చిన్న దేశంలోనూ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నిర్వహిస్తే స్టేడియాలకు జనాలు పోటెత్తారని గుర్తు చేస్తున్నారు.
వ్యూయర్షిప్లోనూ పాక్-నేపాల్ మ్యాచ్కు పెద్దగా ఆదరణ దక్కలేదు. డిస్నీ హాట్స్టార్లో ఏ దశలోనూ వ్యూయర్షిప్ సంఖ్య 15 లక్షలు ధాటలేదు. ఆరంభ మ్యాచ్ కూడా పూర్తిగా వన్సైడ్ కావడం.. పాకిస్థాన్ భారీ స్కోర్ చేయడంతో సెకండ్ ఇన్నింగ్స్ ఎవరూ చూడలేదు. టీవీల్లోనూ చానెల్స్ మార్చేసారు. ఈ ఊహించని పరిణామాన్ని చూసి స్టార్ నెట్వర్క్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో 151), ఇఫ్తికర్ అహ్మద్(71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 109 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమీ రెండు వికెట్లు తీయగా.. కరణ్ కేసీ, సందీప్ లామిచ్చనే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. షాదాబ్ ఖాన్(4/27) నాలుగు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. షాహిన్ షా అఫ్రిది(2/27), హ్యారీస్ రౌఫ్(2/16), రెండేసి వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్(26), సోంపాల్ కమీ(28), గుల్సాన్ జా(13) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. నేపాల్ ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం గమనార్హం.