హైదరాబాద్: ఆసియాకప్ 2023కి రంగం సిద్దమైంది. మరో 14 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీని పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. వన్డే ప్రపంచకప్ ముందు మినీ వరల్డ్కప్లా సాగే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు ఆసియా క్రికెట్ టీమ్స్ సమాయత్తమవుతున్నాయి.
1. భారత్Xపాకిస్థాన్...:ఇక ఆసియాకప్ అనగానే అందరికి దాయాదుల సమరమే గుర్తొస్తుంది. ఈ హైఓల్టెజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా వరల్డ్ బెస్ట్ స్టేడియం మెల్బోర్న్ మైదానం వేదికగా జరిగిన భారత్-పాక్ పోరు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్గా నిలిచిపోయింది.

విరాట్ కోహ్లీ అసాధారణ పోరాటం సగటు క్రికెట్ అభిమాని మనస్సును హత్తుకుంది. ఆసియాకప్ పుణ్యమా అని క్రికెట్ అభిమానులు మరోసారి ఆ హైఓల్టేజ్ సమరాన్ని చూడబోతున్నారు. ఈ ఉత్కంఠ పోరు సెప్టెంబర్ 2న జరగనుంది. కాలం కలిసొస్తే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. లీగ్ దశలో.. సూపర్ 4 దశలో.. ఫైనల్ చేరితో టైటిల్ పోరులోనూ భారత్-పాక్ మ్యాచ్లను చూడవచ్చు.
భారత్-పాక్ సమరంతో పాటు ఆసియాకప్ 2023 టోర్నీలో అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే ఆసక్తికర మ్యాచ్లపై ఓ లుక్కెద్దాం.
2. బంగ్లాదేశ్ X శ్రీలంక:భారత్-పాకిస్థాన్ పోరు తర్వాత అంతటి తీవ్రత కలిగిన మ్యాచ్ బంగ్లాదేశ్-శ్రీలంక పోరు. నిదహాస్ ట్రోఫీ నుంచి ఇరు జట్ల మధ్య సమరం చాలా ఆసక్తికరంగా మారింది. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన ఆ ట్రై సిరీస్ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమిపాలైంది. దాంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగినీ డ్యాన్స్లు వేస్తూ రచ్చ చేశారు.
ఇది ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవకు దారి తీసింది. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. స్లెడ్జింగ్, నాగినీ డ్యాన్స్లతో ఆటగాళ్లు రచ్చ చేస్తున్నారు. ఆసియాకప్లో భాగంగా ఆగస్టు 31న బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కూడా హైఓల్టేజ్ సమరాన్ని తలపించనుంది. ఇరు జట్లు మెరుగ్గా రాణిస్తే గ్రూప్-4, ఫైనల్లో కూడా తలపడే ఛాన్స్ ఉంది.

3. శ్రీలంక X పాకిస్థాన్:ఆసియాకప్ 2023 టోర్నీ ఆతిథ్య దేశాలు అయిన శ్రీలంక, పాకిస్థాన్ మధ్య కూడా ఆసక్తికరపోరు ఉండనుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ 2022 టోర్నీలో లంకను తక్కువ అంచనా వేసిన పాకిస్థాన్ బొక్కబోర్లా పడింది. ఫైనల్లో లంక సూపర్ ఫీల్డింగ్కు చిత్తుగా ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది.
ఈ ఓటమితో శ్రీలంకపై రగిలిపోతున్న పాకిస్థాన్.. ఈసారి చిత్తుగా ఓడించి కసి తీర్చుకోవాలని భావిస్తోంది. వేర్వేరు గ్రూప్ల్లో ఉన్న ఈ జట్లు సూపర్-4లో తలపడే అవకాశం ఉంది.
4. భారత్X శ్రీలంక..:భారత్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ కూడా ఆసక్తికరంగా ఉండనుంది. ఆసియాకప్ 2022 టోర్నీ సూపర్-4లో భారత్ను ఓడించి శ్రీలంక ఫైనల్కు దూసుకెళ్లింది. టీమిండియా ఫైనల్ చేరకుండా అడ్డుకుంది. ఈ ఓటమితో రగిలిపోతున్న భారత్.. ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.
ఈ క్రమంలోనే భారత్-శ్రీలంక మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. వేర్వేరు గ్రూప్స్లో ఉన్న కారణంగా ఇరు జట్లు సూపర్-4లో తలపడే అవకాశం ఉంది.