
ఏజీఎమ్ ఎజెండాలో..?
ఇదే విషయంపై అక్టోబర్ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో చర్చించనున్నారని క్రిక్బజ్ పేర్కొంది. ఈ అంశాన్ని బీసీసీఐ తమ ఎజెండాలో చేర్చిందని, దీనికి సంబంధించిన ఓ నోట్ను రాష్ట్ర సంఘాలకు పంపించిందని తెలిపింది. ఒకవేళ ఆసియాకప్ 2022 టోర్నీ కోసం పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నా భారత ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే అనుమతిపైనే భారత జట్టు పాకిస్థాన్ పర్యటన ఆధారపడి ఉందని ఓ బీసీసీఐ అధికారి క్రిక్బజ్కు తెలిపాడు. 'భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? అన్న అంశం మీదే టీమిండియా పాకిస్థాన్ పర్యటన ఆధారపడి ఉంది'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

జై షా ఉన్న నేపథ్యంలో..
ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఉన్న నేపథ్యంలో భారత జట్టు పాక్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. భారత లేకుండా ఆసియాకప్ నిర్వహిస్తే ఏసీసీకి తీవ్ర నష్టం వాటిల్లనుంది. కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్ షా కొడుకు అయిన జై షా.. టీమిండియా ఆసియాకప్ 2022 ఆడేందుకు అనుమతులు తీసుకొస్తాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ముగిసిన ఆసియా కప్లో దాయాదీ దేశాలు రెండు సార్లు తలపడి చెరొకసారి గెలిచాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ అక్టోబర్ 23న జరిగే తమ తొలి మ్యాచ్లో మరోసారి తలపడనున్నాయి.

ద్వైపాక్షి సిరీస్ల్లో..
కాగా- టీమిండియాకు సంబంధించిన వచ్చే అయిదేళ్ల సైకిల్ను బీసీసీఐ విడుదల చేసింది. 2023-2027 మధ్య అన్ని ఫార్మట్లల్లో భారత్ ఆడబోయే మ్యాచ్ల వివరాలను వెల్లడించింది. ఒక్కో ఫార్మట్లో ఎన్నేసి మ్యాచ్లను ఆడుతుందనే విషయాన్ని స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సిరీస్లల్లో భాగంగా పాకిస్థాన్కు వెళ్లడం గానీ లేదా పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు వచ్చే విషయాన్నే బీసీసీఐ ప్రస్తావించలేదు. ఆసియా కప్ సహా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్ల్లో మాత్రమే భారత్-పాకిస్తాన్ ఎదురుపడతాయి.


Click it and Unblock the Notifications
