న్యూఢిల్లీ: ఆసియా కప్ 2023 నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలతో పాకిస్థాన్కు వెళ్లేందుకు తాము సిద్దంగా లేమని బీసీసీఐ వాదిస్తోంది. తాత్కలిక వేదికగా మ్యాచ్లు నిర్వహించేందుకు కూడా తాము సిద్దమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెళ్లడించింది. భారత్తో జరిగే మ్యాచ్లను మాత్రమే తాత్కలిక వేదికగా నిర్వహించి.. మిగతా మ్యాచ్లను పాక్లో జరుపుతామని తెలిపింది.
ఈ ప్రతిపాదనను కూడా వ్యతిరేకించిన భారత్.. వెంటనే టోర్నీని బహిష్కరించాలని కోరాడు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వెళ్లబోమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు బీసీసీఐకి మద్దతు తెలిపాయి.

దీంతో ఆసియాకప్ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. ఆసియా కప్ నిర్వహణ వేదికపై ఈ నెలాఖరున ఆసియా క్రికెట్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆసియాకప్ స్థానంలో ఐదుగురు జట్లతో కూడిన టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్ కనుక తమ జట్టును పాకిస్తాన్కు పంపకుండా ఆసియా కప్ను బాయ్కాట్ చేస్తే.. తాము కూడా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని పీసీబీ హెచ్చరిచింది. అయినా కూడా బీసీసీఐ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది.
భారత జట్టు చివరగా 2008లో ఆసియా కప్ కోసమే పాక్కు వెళ్లింది. ఆ టోర్నీలో ఫైనల్ చేరిన టీమిండియా.. చివర్లో శ్రీలంక చేతిలో 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2012-13లో పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించింది. అప్పటి నుంచి మళ్లీ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు.