హైదరాబాద్: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో ఈ హైఓల్టేజ్ సమరానికి తెరలేవనుంది. దాయాదుల సమరం కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్.. పసికూన నేపాల్పై భారీ విజయం సాధించి రెట్టించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
మరోవైపు భారత్ సైతం విజయంపై పట్టుదలతో ఉంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. అయితే పాకిస్థాన్ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఆల్రౌండర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు.. నేపాల్ను చిత్తు చేసింది.

ఈ క్రమంలోనే పాకిస్థాన్ బలంగా కనిపిస్తోందని, భారత బ్యాటర్లు ఇబ్బందులు తప్పవని ఆ దేశ మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. టీమిండియా కూడా పటిష్టంగా ఉందని, ఎంతటి బౌలర్ను అయినా చెడుగుడు ఆడే బ్యాటర్లు ఉన్నారని భారత మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, హరీస్ రౌఫ్ లాంటి బౌలర్లకు కోహ్లీ ఒక్కడే సరిపోతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆసియాకప్ జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, హరీస్ రౌఫ్లను కోహ్లీ చూసుకుంటాడని అగార్కర్ చమత్కరించాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు సైతం మా సింహ స్వప్నం విరాట్ కోహ్లీనే.. అతన్ని ఔట్ చేస్తే తమదే విజయమని అభిప్రాయపడుతున్నారు.
అయితే గత రికార్డులను పరిశీలిస్తే విరాట్ కోహ్లీ కంటే కెప్టెన్ రోహిత్ శర్మకే పాకిస్థాన్పై మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 48.72 సగటుతో 536 పరుగులు చేశాడు. ఇందులో రెండేసి సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ రోహిత్ శర్మ 51.42 సగటుతో 720 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు ఉండటం గమనార్హం.
కోహ్లీ కంటే రోహిత్ శర్మకే మెరుగైన రికార్డు ఉందని, శనివారం జరిగే మ్యాచ్లో పాక్ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2021, 22లో రోహిత్ విఫలమయ్యాడని తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.