న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో 13 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నీ సన్నాహకాలు ప్రారంభించాయి. భారత సెలెక్షన్ కమిటీ మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు. సీనియర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల రీఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది.
గాయాలతో గత నాలుగు నెలలుగా జట్టుకు దూరమైన ఈ ఇద్దరూ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్, మాజీ ఛీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్లు మాత్రం ఈ ఇద్దరినీ జట్టుకు దూరంగా ఉంచాలని పరోక్షంగా సూచించారు. తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్లో మాట్లాడుతూ.. ఆసియాకప్ బరిలోకి దిగే టీమ్కాంబినేషన్ను అంచనా వేసారు.

ఈ ఇద్దరికి బదులు తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నాలుగో స్థానంలో అసాధారణ బ్యాటింగ్తో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. దాంతో తిలక్ వర్మనే నాలుగో స్థానానికి సరైనోడని ఎమ్మెస్కే ప్రసాద్, రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు.
లెఫ్టాండర్ కావడం అతనికి కలిసొచ్చే అంశమని, అతను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయరని కొనియాడారు. ముందుగా ఎమ్మెస్కే ప్రసాద్ తన జట్టును ప్రకటించాడు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు తన జట్టులో ఉన్నారని పేర్కొన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్కు కూడా తాను అవకాశం కల్పిస్తున్నానని తెలిపాడు. స్పిన్ ట్రాక్లపై అశ్విన్ అనుభవం ఉపయోగపడుతుందని చెప్పాడు. అశ్విన్ పేరు చెప్పని రవిశాస్త్రి కుల్దీప్ యాదవ్, చాహల్తో పాటు అక్షర్ పటేల్ పేరును సూచించాడు. మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ ఇస్తున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కన్నా యువ ఆటగాళ్లను ఆడించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అధికారికంగా ఆసియాకప్ బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్ట్ 23 నుంచి బెంగళూరు వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించనున్నారు.

ఎక్స్పర్ట్స్ ఎంపిక చేసిన ఆసియాకప్ టీమ్..
శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.