న్యూఢిల్లీ: ఆసియా కప్ 2023 నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉండగా.. దాయాదీ దేశం వెళ్లేందుకు టీమిండియా ససేమిరా అంటుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కారణాలను టీమిండియా సాకుగా చూపిస్తోంది. అంతేకాకుండా పాకిస్థాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశం లేకపోవడంతో.. ఆసియా కప్ వేదికను మార్చాలని పట్టుబడుతోంది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రెసిడెంట్గా బీసీసీఐ సెక్రటరీ జైషానే ఉండటంతో పాకిస్థాన్కు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా ప్రపంచ క్రికెట్ను శాసించే పవర్ బీసీసీఐ దగ్గర ఉండటం.. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా భారత క్రికెట్ బోర్డు కను సన్నల్లోనే పనిచేస్తుండటంతో పాకిస్థాన్ ఏం చేయలేకపోతుంది.

ఆతిథ్యహక్కులను వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడని పాకిస్థాన్.. బీసీసీఐని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదించింది. యూఏఈని తటస్థ వేదికగా ఎంపిక చేసి భారత్ మ్యాచ్లు అక్కడ నిర్వహిస్తామని, మిగతా మ్యాచ్లను పాక్లో ఆడిస్తామని ప్రతిపాదించింది. ఈ విధానానికి ఇతర దేశాలు అంగీకరించడం లేదు.
వేడిగా ఉండే యూఏఈలో ఆడటం కుదరదని, అక్కడ ఆడి మళ్లీ పాక్కు రావడం ఆటగాళ్లకు శ్రమతో కూడిన పనని ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయి. భారత్ కూడా ఈ మోడల్ను అంగీకరించడం లేదు. ఉక్కపోతగా ఉండే యూఏఈలో ఆడటం కష్టమని, టోర్నీని శ్రీలంకకు తరలించాలని కోరుతోంది.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ మరో ప్రతిపాదనను తీసుకొచ్చింది. భారత్ మినహా ఇతర దేశాలతో ఒక్కో మ్యాచ్ను పాకిస్థాన్ వేదికగా నిర్వహించి.. మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా ఆడిస్తామని మరో ప్రతిపాదన చేసింది. దీనికి కూడా భారత్ అంగీకరించడం లేదు. ఆగస్టులో యూఏఈ వేడిని తట్టుకోవడం కష్టమని వాదిస్తోంది.

ఆర్థికంగా చితికిపోయిన శ్రీలంకకు అండగా ఉండాలనే ఆలోచనతోనే అక్కడ ఆసియా కప్ నిర్వహించాలని బీసీసీఐ పట్టుపడుతోందని ఓ అధికారి తెలిపారు. టీమిండియా పాకిస్థాన్ ప్రయాణించడం కుదరదని, ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను కూడా మార్చాలని ఐసీసీని కోరామని సదరు అధికారి పేర్కొన్నాడు. ఆసియాకప్ను శ్రీలంకకు తరలిస్తేనే టోర్నీ జరుగుతుందని, లేకుంటే రద్దు చేసుకోవాల్సిందేనని తెలిపాడు.
ఆసియాకప్ టోర్నీ వ్యవహారం భవిష్యత్తు ఐసీసీ టోర్నీలపై పడుతుందని పీసీబీ ఛీఫ్ నజమ్ సేథి అంటున్నాడు. పాక్కు భారత్ రాకుంటే తాము వన్డే ప్రపంచకప్ను బహిష్కరిస్తామని ఇప్పటికే హెచ్చరించింది.