హైదరాబాద్: ఆసియాకప్ 2023 టోర్నీకి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. వన్డే ప్రపంచకప్కు ముందు టీమ్ కాంబినేషన్ను సరిచూసుకోవడానికి, లోపాలను సవరించుకోవడానికి, బలాబలాలను అంచనా వేసుకోవడానికి, ఎంతో విలువైన ప్రాక్టీస్ను పొందడానికి ఆసియా జట్లకు ఈ టోర్నీ ఓ చక్కని అవకాశం.
ఆరు జట్లు పోటీలో ఉన్నా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థానే పోరే అత్యంత ఆసక్తిరేపుతోంది. పాకిస్థాన్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ.. నేడు(బుధవారం) ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్తో ఆరంభమవుతుంది. తొలిసారి నేపాల్ ఈ టోర్నీకి అర్హత సాధించగా.. పటిష్టమైన పాకిస్థాన్కు ఆ జట్టు ఏ మేర పోటీనిస్తుందో చూడాలి.

భారత్తో హైఓల్టేజ్ సమరానికి ముందు నేపాల్తో మ్యాచ్ను సన్నాహకంగా వాడుకోవాలని బాబర్ సేన భావిస్తోంది. ఇప్పటికే శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన పాకిస్థాన్.. వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకొని ఫుల్ జోష్లో ఉంది. నేపాల్తో మ్యాచ్లో బరిలోకి దిగే తుది జట్టును పాకిస్థాన్ ఒక రోజు ముందే ప్రకటించింది.
అఫ్గానిస్థాన్తో బరిలోకి దిగిన జట్టునే దాదాపు కొనసాగించింది. ముగ్గురు పేసర్లతో పాటు ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగుతోంది. అఘా సల్మాన్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్లతో బ్యాటింగ్ విభాగం.. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఫీల్డింగ్ ఒక్కటి మెరుగుపరుచుకుంటే ఈ టోర్నీలో పాకిస్థాన్కు తిరుగుండదు. ముల్తాన్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఈ మ్యాచ్కు వర్ష సూచన లేదు.
పాకిస్థాన్ తుది జట్టు:
బాబర్ ఆజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇప్తికర్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్(కీపర్), మహమ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్