కొలంబో: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ గొప్ప మనస్సు చాటుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా తనకు లభించిన క్యాష్ ప్రైజ్ను కొలంబో గ్రౌండ్స్మన్కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్(6/21) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. క్యాష్ ప్రైజ్గా లభించిన 50 వేల యూఎస్ డాలర్లను గ్రౌండ్స్మెన్కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. మైదాన సిబ్బంది కష్టం వల్లే ఈ టోర్నీ సాధ్యమైందని వారిని కొనియాడాడు..

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే సమయంలో సిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఈ ప్రదర్శన ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇష్టమైన బిర్యానీ తిందామంటే ఇక్కడ లేదు. చాలా రోజులుగా నేను మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాను. గతంలో ఈ రోజు వచ్చిన ఎడ్జెస్ రాలేదు. పిచ్ ఆరంభంలో పేస్తో పాటు స్వింగ్కు అనుకూలించింది. స్వింగ్ అవుతుండటంతో ఫుల్లర్ లెంగ్త్ బాల్స్ వేయాలనుకున్నా.
మా ఫాస్ట్ బౌలర్ల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బౌండరీ ఆపాలని పరుగెత్తా. అది ఆపి ఉంటే మరింత సంతోషపడేవాడిని. ఇది నా బెస్ట్ స్పెల్. ఈ క్యాష్ ప్రైజ్ను గ్రౌండ్స్మెన్కు ఇచ్చేస్తున్నా. వారు వల్లే ఈ టోర్నీ సాధ్యమైంది.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. స్వల్ప లక్ష్యం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు బదులు.. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్) ఓపెనింగ్ చేశాడు. శుభ్మన్ గిల్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.