న్యూఢిల్లీ: సూపర్ ఫామ్లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్కు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీతో కష్టాలు తప్పవని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కంటే మహమ్మద్ షమీ.. బాబర్ ఆజామ్ను ఇబ్బంది పెట్టగలడని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ చానెల్తో మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'మహమ్మద్ షమీ అద్బుతమైన బౌలర్. సూపర్ ఫామ్లో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జట్టు ప్రధాన పేసర్గా రాణించాడు. అద్భుతమైన బౌలింగ్తో జట్టుకు విజయాలు అందించాడు. ఐపీఎల్లోనూ అతని రికార్డు గొప్పగా ఉంది. అత్యంత ప్రతిభావంతులైన బౌలర్లలో షమీ కూడా ఒకడు.

పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లోనూ షమీ సత్తా చాటుతాడు. ముఖ్యంగా బాబర్ ఆజామ్.. షమీ నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అతని బౌలింగ్ ఆడటం బాబర్ ఆజామ్కు సవాల్తో కూడుకున్నది.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున ఇప్పటి వరకు 64 టెస్ట్లు, 90 వన్డేలు, 23 టీ20లు ఆడిన షమీ.. వరుసగా ఆయా ఫార్మాట్లలో 229, 162, 24 వికెట్లు తీసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత షమీ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని వర్క్లోడ్ను తగ్గించే ఫ్రెష్గా బరిలోకి దిగేందుకు విశ్రాంతినిచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో కలిసి షమీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఒక్క వన్డే మ్యాచ్ కూడా జరగలేదు. దాంతోనే ఆసియాకప్ హైఓల్టేజ్ పోరులో ఎవరు? ఫేవరేట్ అనేది చెప్పడం కష్టంగా మారింది. గతంలో భారత బ్యాటర్లు, పాకిస్థాన్ బౌలర్ల మధ్యనే పోరు ఉండేది.
అయితే ఈ సారి కూడా అదే రిపీట్ కానుంది. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీష్ రౌఫ్ల బౌలింగ్.. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ సత్తాకు పరీక్షగా నిలవనుంది. టీమిండియాలో నెంబర్ 4లో ఆడనున్న శ్రేయస్ అయ్యర్ కీలకం కానుండగా.. పాకిస్థాన్లో షాహిన్ షా అఫ్రిది బౌలింగ్ ప్రదర్శనపై ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.