పల్లెకెలె: ఆసియాకప్ 2023లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కేవలం భారత ఇన్నింగ్స్ మాత్రమే సాధ్యమైన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఒక్క బంతి కూడా బ్యాటింగ్ చేయలేదు.
వన్డే ప్రపంచకప్ ముందు మంచి ప్రిపరేషన్గా భావిస్తున్న ఈ టోర్నీలో భారత్కు ఆశించిన ఫలితం దక్కలేదు.
మరోసారి టీమిండియా బ్యాటింగ్ బలహీనతలు బయటపడ్డాయి. పాకిస్థాన్ పేస్ త్రయం ధాటికి భారత టాపార్డర్ చేతులెత్తేసింది. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 82), హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 87)ల అసాధారణ బ్యాటింగ్తో భారత గౌరవప్రదమైన స్కోర్ చేసింది. షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్ నిప్పులు చెరగడంతో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4), శ్రేయస్ అయ్యర్(14), శుభ్మన్ గిల్(10) దారుణంగా విఫలమయ్యారు.

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన లోయరార్డర్ బ్యాటర్లు రవీంద్ర జడేజా(14), శార్దూల్ ఠాకూర్(3) కూడా తీవ్రంగా నిరాశపరిచారు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. అయితే భారత ఆటగాళ్ల వైఫల్యానికి ప్రధాన కారణం మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమే అనిపిస్తోంది.
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వెస్టిండీస్ పర్యటన తర్వాత ఒక్క మ్యాచ్ ఆడలేదు. జూనియర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వెస్టిండీస్తో వన్డే సిరీస్లోనూ కోహ్లీ, రోహిత్ శర్మలను పక్కనపెట్టారు. శార్దూల్ ఠాకూర్ సైతం విండీస్ పర్యటన తర్వాత ఒక్క మ్యాచ్ ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా ఈ మ్యాచ్లోనే బరిలోకి దిగాడు.
వెస్టిండీస్తో వన్డేలతో పాటు టీ20 సిరీస్ ఆడిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఐర్లాండ్ పర్యటతో రీఎంట్రీ ఇచ్చిన జస్బుమ్రా సైతం మంచి రిథమ్లో కనిపించాడు. బౌలింగ్ చేసే అవకాశం దక్కుంటే మ్యాచ్ ప్రాక్టీస్ విషయంలో మరింత స్పష్టత వచ్చేది. శుభ్మన్ గిల్కు మ్యాచ్ ప్రాక్టీస్ ఉన్నా.. అతను ఒత్తిడిని తట్టుకోలేక వికెట్ సమర్పించుకున్నాడు.
ఆసియాకప్ ముందు ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొన్నామని చెప్పినా.. అది ఏ మాత్రం సరిపోలేదు. కీలక టోర్నీలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు విశ్రాంతితో ఆటకు దూరంగా ఉంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. గాయాలు లేనప్పుడు ఆటగాళ్లు ఎన్ని మ్యాచ్లు ఆడితే అంత రిథమ్లో ఉంటారని అభిప్రాయపడుతున్నారు. భారత్ తదుపరి మ్యాచ్ సోమవారం నేపాల్తో ఆడనుంది.