న్యూఢిల్లీ: ఆసియా కప్ 2023 కోసం శ్రీలంకలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. పసికూన నేపాల్తో మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను స్వదేశం తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్-4 మ్యాచ్లు ప్రారంభమయ్యే సమయానికి అతను మళ్లీ జట్టుతో కలుస్తాడని ప్రచారం జరుగుతుంది.
అత్యవసర పని మీద బుమ్రా ముంబైకి వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బుమ్రా కూడా ఎలాంటి విషయాన్ని పంచుకోలేదు. అత్యవసరంగా బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి. బుమ్రా కుటుంబ సభ్యుల్లో ఎవరైన అనారోగ్యానికి గురయ్యారేమోనని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

గాయంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. ఇటీవలే ఐర్లాండ్ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే బౌలింగ్తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేయకపోయినా.. బ్యాటింగ్లో విలువైన పరుగులు జోడించాడు.
బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో నేపాల్తో మ్యాచ్లో మహమ్మద్ షమీ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయ్యింది.
ఇక్కడే శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యిన విషయం తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్ సాధ్యమవ్వలేదు. దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు. సూపర్-4 మ్యాచ్లు సెప్టెంబర్ 9 నుంచి జరగనున్నాయి.