హైదరాబాద్: ఆసియాకప్ 2023 ఆడే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటి ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అగార్కర్ సోమవారం వెల్లడించాడు. తెలుగు తేజం తిలక్ వర్మ ఈ జట్టులో చోటు దక్కించుకోగా.. గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు.
ఐర్లాండ్ పర్యటనలో పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణలు కూడా ఆసియాకప్కు ఎంపికయ్యారు. వన్డేల్లో మెరుగైన రికార్డులేని సూర్య కుమార్ యాదవ్కు కూడా చోటు దక్కింది. ఆశ్చర్యకరంగా యుజ్వేంద్ర చాహల్పై వేటు వేసిన సెలెక్టర్లు అక్షర్ పటేల్కు అవకాశం కల్పించారు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇచ్చారు.

సంజూ శాంసన్ను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. అయితే ఈ జట్టు ఎంపికపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత జట్టులా? లేదని ముంబై ఇండియన్స్, ముంబై రంజీ టీమ్లా ఉందని సెటైర్లు పేల్చుతున్నారు. ముంబైకి చెందిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. తమకు చెందిన ఆటగాళ్లకే అవకాశాలు కల్పించారని ఆరోపిస్తున్నారు.
ఆసియాకప్ 2023 ఎంపికలో ముంబై లాబియింగ్ స్పష్టంగా కనిపిస్తుందని మండిపడుతున్నారు. వన్డేల్లో గొప్ప రికార్డు లేని సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయడం చూస్తుంటేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కంటే సంజూ శాంసన్ వన్డే రికార్డులు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.
ఇక ఆసియాకప్ జట్టుకు ఎంపిక చేసిన 17 మంది సభ్యుల్లో 8 మంది ముంబై రంజీ టీమ్, ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడినవారేనని ఆరోపిస్తున్నారు. ముంబై మాజీ క్రికెటర్గా.. ఆ జట్టు చీఫ్ సెలెక్టర్గా పని చేసిన అగార్కర్.. ఆటగాళ్ల ఎంపికలో పక్షపాతం చూపించాడని మండిపడుతున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ ప్లేయర్లు కాగా.. హార్దిక్ పాండ్యా గతంలో ఆ జట్టుకే ఆడాడు. శ్రేయస్ అయ్యర్ ముంబై రంజీ జట్టుకు ఆడుతాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది భారత జట్టా? ముంబై జట్టా? అని ప్రశ్నిస్తున్నారు.