హైదరాబాద్: ఆసియాకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియాను శ్రీలంక కలవరపెడుతోంది. నేపాల్ను ఓడించి సూపర్-4కు అర్హత సాధించిన టీమిండియా.. పాకిస్థాన్, శ్రీలంకను మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. టోర్నీ చరిత్రలోనే 10వ సారి ఫైనల్ చేరింది.
ఇక పాకిస్థాన్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సంచలన విజయాన్నందుకున్న శ్రీలంక మరో జట్టుగా ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. అయితే శ్రీలంక ఫైనల్ చేరడమే ఇప్పుడు టీమిండియాకు శాపంగా మారిందా? అంటే అవుననే సమాధానమిస్తోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 12 సార్లు ఫైనల్ చేరి 6 సార్లు విజయం సాధించింది.

మరోసారి తాజాగా ఫైనల్ చేరింది. మరోవైపు భారత్ మాత్రం ఈ టోర్నీకి ముందు 9 సార్లు ఫైనల్ చేరి ఏడుసార్లు విజేతగా నిలిచింది. పాక్పై అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్ పోరులో భారత్తో ఆడేందుకు లంక సిద్ధమైంది. పటిష్ఠ స్థితిలో ఉన్న ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
ఎందుకంటే సూపర్ 4 మ్యాచ్లో పాక్పై అన్ని విభాగాల్లో రాణించి.. భారత్ భారీ విజయాన్ని నమోదు చేసి.. ఆ మరుసటి రోజే అదే మైదానంలో లంకతో ఆడింది. అయితే.. స్పిన్కు అనుకూలించిన పిచ్పై టీమ్ఇండియా చెమటోడ్చి నెగ్గాల్సి వచ్చింది. అంతకుముందు పాక్తో మ్యాచ్లో శతకాలు, అర్ద శతకాలతో చెలరేగిన టీమ్ఇండియా బ్యాటర్లు.. లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. మొత్తం పది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం గమనార్హం.
ఇటీవల కాలంటో టీమిండియా ఆటగాళ్లు స్పిన్కు తడబడుతున్నారు. ఫైనల్లో ఎలా ఆడతారనేదానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు పాకిస్థాన్పై విజయం శ్రీలంకకు రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ జట్టు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు.. ఫీల్డింగ్తో తడబడుతున్నారు. సునాయస క్యాచ్లను నేలపాలు చేస్తున్నారు.