హైదరాబాద్: ఆసియాకప్ 2023లో బోణీ చేసిన టీమిండియా సూపర్-4కు అర్హత సాధించింది. పసికూన నేపాల్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సూపర్-4కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాదీ పాకిస్థాన్తో తలపడనుంది. గత శనివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
దాంతో భారత్-పాక్ మ్యాచ్ అసలు సిసలు మజాను అభిమానులు మిస్సయ్యారు. అయితే సూపర్-4లో భాగంగా దాయాదీ దేశాలు సెప్టెంబర్ 10న తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ కొలంబో వేదికగా జరగాల్సి ఉంది. కానీ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతవారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్ తరలించే అంశంపై ఏసీసీ సమాలోచనలు చేస్తోంది.

దంబుల్లా లేదా పల్లెకెలెకు ఈ మ్యాచ్తో పాటు ఇతర సూపర్-4 మ్యాచ్లను తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తోంది. రెండు రోజుల్లో వేదికల తరలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నేపాల్తో మ్యాచ్లో టీమిండియా సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్కు కలిసొచ్చింది.
అనంతరం వర్షం కారణంగా టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించారు. ఇక భారత్ 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 74 నాటౌట్), శుభ్మన్ గిల్(62 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.