పల్లెకెలె: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే సాధ్యమైంది. ఎంతో ఆసక్తిగా ఈ హైఓల్టేజ్ సమరం కోసం ఎదురు చూసిన క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది.
భారత ఇన్నింగ్స్ సమయంలో రెండు సార్లు ఆటంకం కలిగించిన వర్షం.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు మరోసారి అంతరాయం కలిగించింది. దాంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పివేసారు. ఆ తర్వాత వర్షం ఆగడంతో మైదానాన్ని ఆటకు సిద్దం చేయగా.. మళ్లీ వర్షం వచ్చింది. భారీగా వర్షం పడటంతో మైదానం చిత్తడిగా మారింది.

ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ పూర్తి చేసే అవకాశాలు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో గ్రూప్-ఏ టాపర్గా పాకిస్థాన్ సూపర్-4కు అర్హత సాధించింది. నేపాల్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 48.5 ఓవర్లలో266 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్(81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 82), హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 87) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 138 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.
చివర్లో బుమ్రా(16) విలువైన పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీసారు. వర్షం కారణంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా క్రికెట్ మ్యాచ్లు లేక బోరుగా ఫీలవుతున్న అభిమానులకు.. హైఓల్టేజ్ మ్యాచ్ రద్దవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది.