ఒకే గ్రూప్లో భారత్-పాక్..
వన్డే ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్ - 2023 లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయని పేర్కొన్న జైషా.. సెప్టెంబర్ ఈ టోర్నీ జరుగుతుందని వెల్లడించాడు. గతేడాది మాదిరిగానే ఆరు జట్లతో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్, పాకిస్తాన్ తో పాటు క్వాలిఫయర్ ఓ గ్రూప్ లో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లు మరో గ్రూప్ లో ఉన్నాయి. '2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ క్రికెట్ క్యాలెండర్ ను మీకు పరిచయం చేస్తున్నా. ఆటను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను మా అసమానమైన ప్రయత్నాలను ఇది సూచిస్తుంది.'అని జై షా ట్వీట్ చేశాడు.

ఆ విషయం చెప్పని జై షా..
ఏసీసీ రెండేండ్ల క్రికెట్ క్యాలెండర్ విడుదల చేసిన జై షా టోర్నీ వేదికలను పంచుకోలేదు. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే ఆసియా కప్ వేదిక గురించి చెప్పలేదు. ఈ ఏడాది ఆసియాకప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉండగా.. అక్కడికి వెళ్లేందుకు టీమిండియా ఆసక్తి చూపడం లేదు. భారత ప్రభుత్వం నుంచి కూడా టీమిండియాకు పాకిస్థాన్ వెళ్లేందుకు అనుమతి లభించే అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే భారత్.. పాకిస్థాన్ వెళ్లదని జై షాతో పాటు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 జరుగుతుందని అప్పట్లో జై షా ప్రకటించాడు.

తటస్థ వేదికగా ఆసియాకప్..
ఇక ఆసియా కప్ ఆడేందుకు పాక్కు టీమిండియా రాకుంటే తాము వన్డే ప్రపంచకప్ బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో జై షా క్యాలెండర్ ట్వీట్ చర్చనీయాంశమైంది. పాక్కు వచ్చే ప్రసక్తే లేదని, తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్ ఆడతామన్న బీసీసీఐ.. మరి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తటస్థ వేదికగానే ఆసియాకప్ జరిగే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications












