హైదరాబాద్: ఆసియాకప్ 2023 ఆడే టీమిండియాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఓవైపు సీనియర్ ఆటగాళ్ల గాయాలు.. మరోవైపు యువ ఆటగాళ్ల అనుభవరాహిత్యం.. ఇంకోవైపు లెఫ్ట్ రైట్ కాంబినేషన్.. టీమిండియా మేనేజ్మెంట్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా తీవ్ర గాయాలతో చాలా రోజులుగా టీమిండియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ పూర్తిగా కోలుకోకపోగా.. జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి సిద్దమయ్యాడు. మరికొద్దిసేపట్లో ఐర్లాండ్తో జరిగే తొలి టీ20తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్పై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఇద్దరు ఇంకా కోలుకోలేదని, ఆసియాకప్ బరిలోకి దిగరని ఇన్నాళ్లు ప్రచారం జరగగా.. అంతలోనే ఈ ఇద్దరు ఫిట్ అయ్యారని మరో వార్త బయటకు వచ్చింది.

అయ్యర్ ఫిట్నెస్పై అనుమానాలున్నా.. రాహుల్ బరిలోకి దిగుతాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు మాత్రం ఈ ఇద్దర్నీ పక్కనపెట్టాలని సూచించారు. చాలా రోజులుగా జట్టుకు దూరంగా ఉండి.. గాయాల నుంచి ఇప్పుడే కోలుకున్న ఈ ఇద్దరి కన్నా సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా లెఫ్టాండర్ అయిన తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా నాలుగో స్థానానికి అతను సరైనోడని, యువరాజ్ సింగ్ లోటు తీర్చగలడని అభిప్రాయపడుతున్నారు. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లంతా రైట్ హ్యాండ్ బ్యాటర్లేనని.. టాప్-3లో ఒక్కరైనా లెఫ్టాండర్ ఉంటే ప్రత్యర్థి బౌలర్లు ఇబ్బంది పడతారని సూచిస్తున్నారు.
కానీ టీమ్మేనేజ్మెంట్ మాత్రం ఈ సూచనలను బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకుంటే సూర్యకుమార్ యాదవ్ను తీసుకోవాలనుకుంటోంది. కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే అతనితో కీపింగ్ చేయించి మిడిలార్డర్లో ఆడించాలనుకుంటోంది. ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న తిలక్ వర్మ.. విండీస్ తరహా ప్రదర్శననే కొనసాగిస్తే అతని స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికచేయాలనుకుంటోంది.

తిలక్ వర్మ అద్భుతంగా ఆడుతున్నా ఒత్తిడిని అధిగమించే పరణితి అతనికి ఇంకా రాలేదని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే అతను ఆసియాకప్ జట్టుతో పాటు ప్రపంచకప్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 21న ఆసియాకప్ బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆ రోజు సెలెక్షన్ కమిటీ సమావేశం జరగనుందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.