కొలంబో: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్లో ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసాడు. అతని ధాటికి శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సిరాజ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ పాతుమ్ నిస్సంక(2) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. బ్యాక్వర్డ్ పాయింట్లో సూపర్ డైవ్తో జడేజా అందుకున్న క్యాచ్తో పాతుమ్ నిస్సంక నోరెళ్ల బెట్టాడు. అసాధారణ క్యాచ్తో నిరాశగా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమా మరుసటి బంతిని డాట్ చేసి మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.

రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ మరుసటి బంతికి గత మ్యాచ్ విన్నర్ చరిత్ అస్సలంక(0) డకౌటయ్యాడు. సిరాజ్ వేసిన ఫుల్ డెలివరీని అసలంక డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా కవర్స్లో ఉన్న కిషన్ చేతిలో పడింది. అనంతరం ధనంజయ డిసిల్వా(4) బౌండరీ కొట్టి చివరి బంతికి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
సిరాజ్ వేసిన ఔట్ స్వింగర్ పుష్ చేసే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో ఒకే ఓవర్లో సిరాజ్ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్గా సిరాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.
తన మరుసటి ఓవర్లో కెప్టెన్ డసన్ షనక(0)ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక 12 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక తొలి వికెట్ తీయగా.. సిరాజ్ ఆ జట్టు పతనాన్ని శాసించాడు.
భారత పేసర్ల ధాటికి కుదేల్ అయిన శ్రీలంక ఆత్మరక్షణలో ఆడుతోంది. క్రీజులోకి వచ్చిన దునిత్ వెల్లలాగే(4 బ్యాటింగ్)తో కుశాల్ మెండిస్(6 బ్యాటింగ్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సిరాజ్తోనే బౌలింగ్ను కొనసాగిస్తున్నాడు.