కొలంబో: ఆసియా కప్ 2023 టైటిల్ను టీమిండియా సొంతం చేసుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా 8వ సారి ఆసియాకప్ను ముద్దాడింది. హోరాహోరీగా సాగుతుందని భావించిన ఫైనల్ మ్యాచ్.. భారత పేసర్ల ధాటికి 21.3 ఓవర్లలోనే ముగిసింది.
టైటిల్ ఫైనల్ ఇంత ఏకపక్షంగా సాగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు.

భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌటవ్వడం గమనార్హం. శ్రీలంక ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు పేసర్లే తీయడం విశేషం.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. స్వల్ప లక్ష్యం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు బదులు.. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్) ఓపెనింగ్ చేశాడు.
శుభ్మన్ గిల్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. శుభ్మన్ గిల్ 6 బౌండరీలతో జోరు కనబర్చగా.. ఇషాన్ కిషన్ మూడు బౌండరీలు బాదాడు. వన్డే ప్రపంచకప్ ముందు దక్కిన ఈ విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది. ప్రపంచకప్ ముందు టీమిండియా.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్లోనూ ఇదే జోరును కొనసాగించి.. ప్రపంచకప్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలనుకుంటోంది. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది.