హైదరాబాద్: ఆసియాకప్ 2023 కోసం అన్ని విధాల సిద్దమయ్యామని, ఈ టోర్నీ తమ ఫిట్నెస్కు పరీక్ష కాదని పాక్తో మ్యాచ్కు ముందు రోజు విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. నిప్పులు చెరిగే పాకిస్థాన్ బౌలర్లను తమ అనుభవంతో ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశాడు. కానీ అతని వ్యాఖ్యలకు భిన్నంగా టీమిండియా విఫలమవ్వడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
పాకిస్థాన్తో టీమిండియా టాపార్డర్, లోయరార్డర్ కుప్పకూలగా.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా సూపర్ బ్యాటింగ్తో ఇజ్జత్ దక్కింది. ప్రపంచకప్కు ఇంకా నెల రోజుల సమయమే ఉండగా.. భారత ప్రధాన బ్యాటర్లు ఎవరూ ఉత్తమ ఫామ్లో కనిపించడం లేదు. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ, రోహిత్లే నిలకడగా ఆడట్లేదు. పాక్తో కీలక పోరులో వీళ్లిద్దరూ దారుణంగా విఫలమయ్యారు.

ఈ ఏడాది పరుగుల వరద పారించిన శుభ్మన్ గిల్ పాక్తో మ్యాచ్లో నిరాశపరిచాడు. పసికూన నేపాల్తో జరిగిన మ్యాచ్లోనూ రోహిత్ శర్మ తడబడటం అందర్నీ విస్మయపరిచింది. తొలి ఓవర్లో నేపాల్ పేసర్ కరణ్ కేసీ బంతులకు రోహిత్ పదే పదే బీట్ అయ్యాడు. బంతి రెండు సార్లు ప్యాడ్కు తాకగా.. ఎల్బీ కోసం నేపాల్ సమీక్ష కూడా కోరింది. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ బౌండరీలు బాదడంతో రోహిత్పై ఒత్తిడి తగ్గింది.
వర్షం అంతరాయం కూడా రోహిత్కు కలిసొచ్చింది. ఈ సమయంలో డగౌట్ చేరిన రోహిత్ నేరుగా క్రికెట్ అనలిస్ట్ దగ్గరకు వెళ్లి నేపాల్ బౌలర్ బౌలింగ్ను పరిశీలించాడు. తాను చేస్తున్న తప్పిదం ఏంటో తెలుసుకున్నాడు. మ్యాచ్ పున:ప్రారంభమైన తర్వాత రెచ్చిపోయాడు. బ్యాటింగ్ కథ ఇలా ఉంటే.. బౌలింగ్లో కూడా టీమిండియా తేలిపోయింది.
నేపాల్ లాంటి పసికూన భారత్కు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం చూస్తే భారత్ బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే నేపాల్.. నిప్పులు చెరిగే పాకిస్థాన్ బౌలర్ల ముందు క్రీజులో నిలబడలేకపోయింది. 104 పరుగులకే కుప్పకూలింది. పాక్ పేసర్ల వేగవంతమైన బంతులను కూడా నేపాల్ బ్యాటర్లు టచ్ చేయలేకపోయారు. కానీ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌన్సర్లు వేసిన భారత బౌలర్లకు భారీ సిక్సర్లతో సమాధానమిచ్చారు.
టీమిండియా ఫీల్డింగ్ అయితే మరీ నాసిరకం. క్రికెట్ నేర్చుకునే కుర్రాళ్లు కూడా ఇన్ని తప్పిదాలు చేయరు. చేతుల్లోకి వచ్చిన సునాయస క్యాచ్లను భారత ఆటగాళ్లు అందుకోలేకపోయారు. తొలి 6 ఓవర్లలో నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన లడ్డుల్లాంటి మూడు క్యాచ్లను నేలపాలు చేశారు. స్లిప్లో శ్రేయస్ అయ్యర్ ఒకటి జారవిడిస్తే.. షార్ట్ కవర్లో అత్యుత్సాహంతో కోహ్లీ మరొకటి వదిలేసాడు.
వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన ఎడమ వైపు వేగంగా కదులుతూ మరో క్యాచ్ నేలపాలు చేశాడు. మొత్తం ఈ మ్యాచ్లో భారత్ 6 క్యాచ్లను నేలపాలు చేసింది. మిస్ ఫీల్డ్లతో అదనంగా పరుగులిచ్చింది. భారత ఫీల్డింగ్ వైఫల్యాన్ని రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు. పరమ చెత్తగా ఉందని తెలిపాడు.
ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ బలహీనతలు బయటపడ్డాయి. ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని గాడిన పడకపోతే ప్రపంచకప్లో భారత్కు కష్టాలు తప్పవు.