హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్ కూడా వర్షంతో రద్దయ్యే అవకాశాలున్నాయి. ఆసియాకప్ 2023లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన తొలి దాయాదుల సమరం వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ మాత్రమే చేయగా.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు.
పసికూన నేపాల్పై విజయం సాధించిన ఇరు జట్లు సూపర్-4 అర్హత సాధించాయి. అయితే సూపర్-4 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న కొలంబో నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఆలస్యం కారణంగా గత రెండు వారాలుగా అక్కడ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.

ఆ రోజంతా 75 శాతం వాన పడే అవకాశం ఉంది. మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. మధ్యాహ్న సమయంలో 99 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది. 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ మ్యాచ్ కూడా ఫలితం తేలకుండానే రదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వర్షాల నేపథ్యంలో సూపర్-4 మ్యాచ్ల వేదికను హంబన్టోటకు మార్చాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ప్రతిపాదించినప్పటికీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఒప్పుకోలేదు. ఇంత తక్కువ వ్యవధిలో సామగ్రి, సిబ్బందిని అక్కడికి తరలించడం చాలా కష్టమని అధికారిక బ్రాడ్కాస్టర్ చెప్పడమే అందుకు కారణమని తెలుస్తోంది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉందని జరిగిన ప్రచారంలో కూడా వాస్తవం లేదు. ఈ ఒక్క మ్యాచ్కు రిజర్వ్డే కేటాయిస్తే మిగతా అన్నీ మ్యాచ్లకు పెట్టాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని ఏసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్తో మ్యాచ్ కోసం ఇప్పటికే కొలంబో చేరిన టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కొలంబోలో వర్షాల కారణంగా టీమిండియా ప్రాక్టీస్ ఇండోర్కే పరిమితమైంది. గురువారం చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
సర్జరీ తర్వాత సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ మళ్లీ భారత జట్టులో చేరాడు. నెట్స్లో మునుపటి లయతో కనిపించాడు. మంచి టైమింగ్తో షాట్లు.. హాఫ్ డ్రైవ్లు ఆడాడు. వికెట్ కీపింగ్ మాత్రం చేయలేదు. కేఎల్తో పాటు హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ ఇండోర్ సెషన్లో పాల్గొన్నారు. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కు రోహిత్ శర్మ, కోహ్లీ దూరంగా ఉన్నారు.