న్యూఢిల్లీ: ఆసియా కప్ 2023 నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే ఈ టోర్నీకి సంబంధించి కీలక అప్డేట్ వస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన చేయకపోయినా బీసీసీఐ అధికారుల సమాచారం మేరకు పాకిస్థాన్కు ఏసీసీ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
ఆడితే ఆడండి.. మీరు లేకున్నా ఆసియా కప్ నిర్వహిస్తామని పీసీబీకి ఏసీసీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆసియాకప్లో ఆతిథ్య పాకిస్థాన్ పోటీపడేది అనుమానంగా మారింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబరులో పాకిస్థాన్లో నిర్వహించాలి. భద్రత కారణాలతో ఆ దేశంలో పర్యటించేందుకు బీసీసీఐ విముఖత చూపిస్తోంది.

దాంతో పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను ఏసీసీ ముందు ఉంచింది. భారత్ మ్యాచ్లను మాత్రం దుబాయ్లో నిర్వహించి మిగతా మ్యాచ్లో పాక్లో జరుపుతామని తెలిపింది. ఈ ప్రతిపాదనకు ఇతర దేశాలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే టోర్నీలో అన్ని మ్యాచ్లు ఒకే వేదికలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పాక్ నుంచి ఆసియాకప్ను తరలించడంపై కూడా తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆడకపోయినా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లతో పాటు మరో జట్టుతో కలిసి శ్రీలంకలో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఏసీసీ సిద్ధమవుతోంది. మరి పాకిస్థాన్ ఆడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆసియాకప్ నిర్వహణ నేపథ్యంలో భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్లోనూ ఆ జట్టు పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'ఆసియా కప్ను పాకిస్థాన్లో నిర్వహించే అవకాశాలు ఒక్క శాతం కూడా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా తరలించాలని మేం ఐసీసీని కోరనున్నాం. ప్రస్తుతానికి ఆసియా కప్ మాత్రం శ్రీలంకలో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఏసీసీ సభ్య దేశాలు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నాయి. త్వరలో జరుగబోయే ఏసీసీ మీటింగ్లో ఆసియా కప్ నిర్వహణపై తుది నిర్ణయం వెలువడనుంది.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.