న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 టోర్నీకి వరుణుడి సెగ తగిలింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్ సాధ్యమవ్వలేదు.
దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు. భారత ఇన్నింగ్స్ సమయంలోనూ రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించినా.. ఆ తర్వాత ఆగిపోవడంతో మ్యాచ్ పున:ప్రారంభమైంది. కానీ భారత ఇన్నింగ్స్ అనంతరం భారీ వర్షం రావడంతో మైదానం తడిచి ముద్దయ్యింది.

మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చినా.. మైదానం సిద్దం చేసే సమయానికి మళ్లీ వచ్చింది. దాంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. అయితే శ్రీలంకలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సూపర్-4 మ్యాచ్లన్నీ కొలంబో వేదికగానే జరగాల్సి ఉంది. సెప్టెంబర్ 6 నుంచి సూపర్ -4 మ్యాచ్లు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 9 నుంచి కొలంబో వేదికగా మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఆ సమయానికి ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువవుతుందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫైనల్ మ్యాచ్ కూడా కొలంబో వేదికగానే సెప్టెంబర్ 17న జరగాల్సి ఉంది.
అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సూపర్-4 మ్యాచ్ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబో వేదికగా జరగాల్సిన అన్నీ మ్యాచ్లను దంబుల్లా లేదా పల్లెకెలె మైదానాలకు తరలించాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.
వాస్తవానికి శ్రీలంక క్రికెట్ బోర్డు.. కొలంబోకు బదులు దంబుల్లా వేదికగా మ్యాచ్లు నిర్వహించాలని ముందు సూచించింది. కానీ అధికారిక బ్రాడ్కాస్టర్, టోర్నీలో పాల్గొనే జట్లు దంబుల్లా వేదికగా మ్యాచ్ల నిర్వహణను వ్యతిరేకించాయి. జట్ల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని అభ్యంతరం చెప్పాయి. సూపర్ -4 మ్యాచ్ల ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం ఉన్నా.. శ్రీలంకలోని ప్రస్తుత వాతావరణం ఏసీసీ పెద్దలకు ఆందోళన కలగజేస్తోంది.