
హైదరాబాద్: ఆసియాకప్లో భాగంగా భారత్ X పాకిస్థాన్ పోరు సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ విమర్శలకు అస్త్రంగా మారింది. జాతీయ లీడర్ల నుంచి చోటా మోటా నాయకుల వరకు అందరూ ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా.. భారత్Xపాక్ మ్యాచ్కు హాజరయ్యారు. ఈ హైఓల్టేజ్ సమరంలో భారత్ విజయం సాధించడంతో భారత అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.
స్టేడియంలోని ప్రేక్షకులు జాతీయ జెండాలు చేతబూని, సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ భారత విజయాన్ని ఆస్వాదించారు. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి హోదాలో ఇతర క్రికెట్ బోర్డు అధికారులతో కలిసి మ్యాచ్ వీక్షించిన జై షా సైతం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చప్పట్లతో ఆటగాళ్లను అభినందించారు. ఇంతలో భారత్కు చెందిన ఓ వ్యక్తి జాతీయ జెండాను జై షాకు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని జై షా సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ వీడియోను బీజేపీ వ్యతిరేకులు అస్త్రంగా మలుచుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా జాతీయ జెండాను పట్టుకోలేదని నానా రచ్చ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో పాటు టీఆర్ఎస్ అధికారిక ప్రతినిధి క్రిశాంక్ సైతం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. జై షా స్థానంలో మరే వ్యక్తి ఉన్నా రచ్చ చేసేవారని, అమిత్ షా కొడుకు కావడంతో జై షా బతికిపోయారని సెటైర్లు పేల్చారు.
అయితే జై షా జాతీయ జెండాను తీసుకోకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. అతను బీసీసీఐ సెక్రటరీ హోదాలో కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మ్యాచ్కు హాజరయ్యాడు. ఆ క్రమంలోనే భారత జెండాను తీసుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకొని విమర్శలు గుప్పించాలని అతని సన్నిహితులు, అభిమానులు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం భారత్-పాక్ మ్యాచ్ కంటే ఎక్కువ చర్చనీయాంశమైంది.