
దుబాయ్: భారత్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ విలక్షణమైన బ్యాటరని కొనియాడాడు. మూడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులు సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని సూచించాడు. ఆసియాకప్ 2022లో హంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 నాటౌట్) పరుగుల విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.
తనదైన బ్యాటింగ్తో మైదానం నలువైపులా చూడ చక్కని షాట్లు ఆడిన సూర్యపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే సూర్య బ్యాటింగ్కు ఫిదా అయ్యి వంగి సలామ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేసింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం గంభీర్, సూర్య మధ్య జరిగిన సరదా చిట్చాట్కు సంబంధించిన వీడియో ఆలస్యంగా వైరల్ అయ్యింది.
హిందీ కామెంటేటర్గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్.. మ్యాచ్ అనంతరం సూర్య బ్యాటింగ్ను కొనియాడుతూ టీవీ యాంకర్ జతిన్ సప్రుతో మాట్లాడాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సూర్య.. గంభీర్ వెనుకాల నిల్చొని కెమెరావైపు చూస్తూ.. అతన్ని పట్టుకున్నాడు. దాంతో గంభీర్ షాకయ్యాడు. 'సూర్య మూడో స్థానంలో ఆడాలి. నా అభిప్రాయం ఇదే'అని గంభీర్ మాట్లాడుతుండగా.. ఆ మాట అతనికే చెప్పు.. అతను ఏ స్థానంలోనైనా ఆడే ఆటగాడంటూ జతిన్ పేర్కొన్నాడు. దాంతో స్టన్ అయిన గంభీర్ అదే అతని బలం అంటూ నవ్వుతూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
లీగ్ మ్యాచ్ల్లో రెండింటికి రెండు గెలిచిన టీమిండియా.. గ్రూప్-ఏ టాపర్గా సూపర్ 4 చేరింది. మరోవైపు భారత్ చేతిలో ఓడి.. హాంగ్ కాంగ్పై భారీ విజయాన్నందుకున్న పాక్ గ్రూప్ ఏ రన్నరప్గా ముందడుగు వేసింది. సూపర్ 4 పోరులో ఆదివారం భారత్తో అమితుమీ తేల్చుకోనుంది. దాంతో మరోసారి హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. తొలి మ్యాచ్ తరహాలోనే పాక్ను మళ్లీ ఓడించి తమ జోరు కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తుండగా.. గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది.