
దుబాయ్: ఆసియాకప్ 2022 ప్రారంభమైన 15 నిమిషాల్లోనే వివాదం రాజుకుంది. శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో అంపైర్ల తప్పిదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్ కూడా తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్టాపిక్గా మారింది.
అసలేం జరిగిందంటే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్, అఫ్గాన్ పేసర్ ఫజల్లాక్ ఫరూఖీ దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే వరుస బంతుల్లో ఇద్దరు బ్యాటర్లను పెవిలియన్కు చేర్చాడు. ఈ ఓవర్ ఐదో బంతికి లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(2) ఎల్బీగా పెవిలియన్ చేర్చిన ఫరూఖీ.. ఆ మరుసటి బంతికి క్రీజులోకి వచ్చిన అసలంక(0)ను సైతం ఎల్బీగా ఔట్ చేశాడు.
నవీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్లో అంపైర్ల తప్పిదం కారణంగా పాతుమ్ నిస్సంక(3) పెవిలియన్ చేరాడు. నవీన్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని ఓవర్ మిడాన్ దిశగా పాతుమ్ నిస్సంక ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. అఫ్గాన్ ఆటగాళ్లు అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర ఔటిచ్చాడు. ఇక బ్యాట్కు బంతి తాకలేదనే నమ్మకంతో నిస్సంక రివ్యూ తీసుకోగా.. థర్డ్ అంపైర్ సైతం ఔటిచ్చాడు. రిప్లేలో బంతి బ్యాట్ను తాకినట్లు కనిపించలేదు. స్నీకో మీటర్లో కూడా గీత రాలేదు. అయినా థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దాంతో లంక ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఆ జట్టు కోచ్ అయితే తన సైగలతో నిరసన వ్యక్తం చేశాడు.
ఇంతటి బిగ్ టోర్నీలో అంపైర్లు తప్పిదం చేయడం సరికాదని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదే తప్పిదం భారత్ X పాక్ మ్యాచ్లో జరిగితే అంపైర్ల కెరీర్కు ముగింపు పడేదని కామెంట్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పవర్ ప్లే ముగిసేసరికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో భానుక రాజపక్స(19), దనుష్క గుణతిలక(15) ఉన్నారు.