
న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది అవసరం వచ్చినప్పుడల్లా భారత జట్టుపై తన అక్కసును వెళ్లగక్కుతాడు. తాను ఆటగాడిగా కొనసాగిన సమయంలోనూ భారత ఆటగాళ్లతో మైదానంలో గొడవకు దిగాడు. ముఖ్యంగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, అఫ్రిది నిప్పు ఉప్పులా ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి దిగారు. గంభీర్ సైతం పాక్ అంటే రగిలిపోతాడు. ఉగ్రవాదం పేరిట సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న ఆకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతాడు.
ఈ క్రమంలోనే పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనేది అతని అభిప్రాయం. పాక్తో మ్యాచ్ జరిగినప్పుడల్లా భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తాడు. ఇక ఆసియాకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్పై శ్రీలంక గెలవడంతో గంభీర్ తెగ సంతోషం వ్యక్తం చేశాడు. శ్రీలంక గెలిచింది అనకంటే పాకిస్థాన్ ఓడిందనేదే గంభీర్ను ఎక్కువగా సంతోషపరిచింది. దాంతో అతను శ్రీలంక జెండాను ఊపి ఆ జట్టు అభిమానులను అలరించాడు. ఈ వీడియోను అతనే ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
గంభీర్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో టీమిండియా గురించి అఫ్రిది పాజిటివ్గా మాట్లాడిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. సరిగ్గా వారం రోజుల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ అనంతరం అఫ్రిది.. పాక్కు చెందిన 'సమా'చానెల్ డిబేట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అఫ్రిది మాట్లాడుతూ భారత్-పాక్ మ్యాచ్కు హాజరైన తన చిన్న కూతురు భారత జెండాను ఊపిందని తెలిపాడు.
ఆ మ్యాచ్ సమయంలో స్టేడియంలో 10 శాతం మంది పాకిస్థాన్ అభిమానులుంటే, 90 శాతం మంది భారత అభిమానులున్నారని తెలిపాడు. స్టేడియంలో పెద్దగా పాకిస్థానీ ఫ్యాన్స్ కనిపించడంలేదని తన భార్య కూడా చెప్పిందని, ఊపేందుకు పాకిస్థాన్ జెండాలు దొరక్కపోవడంతో తన చిన్న కుమార్తె భారత జెండా తీసుకుని ఊపిందని అఫ్రిది నవ్వుతూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా తనకు అందిందని, కానీ దాన్ని ఆన్ లైన్ లో షేర్ చేయొచ్చో, లేదో తెలియదని అన్నాడు. ఇక అఫ్రిదికి సంబంధించిన ఈ వీడియోను కొందరు ఉద్దేశపూర్వకంగానే వైరల్ చేశారు. గంభీర్ వీడియోను కౌంటర్గానే ఇది షేర్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.