
నేడు రాహుల్, దీపక్ రాక..
జింబాబ్వే పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్, దీపక్ హుడా, దీపక్ చాహర్, అక్షర్ పటేల్(స్టాండ్బై)లు ఈ రోజు(మంగళవారం) అర్థరాత్రి వరకు దుబాయ్కు చేరుకోనున్నారు. ఆగస్టు 28న పాకిస్థాన్తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే వారం రోజుల ముందుగానే యుఏఈ చేరిన టీమిండియా టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు మొదలుపెట్టనుంది. పాక్తో మ్యాచ్కు ముందు మూడు రోజులు భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించనున్నారు.

పాకిస్థాన్ సైతం..
మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా యూఏఈకి చేరుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి నేరుగా దుబాయ్కు చేరుకున్నారు. ఇక ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్తో 15వ ఆసియాకప్కు తెరలేనుంది. ఆ మరుసటి రోజు (ఆగస్టు 28) టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.

కోహ్లీపైనే అందరి కళ్లు..
ఇక ఆసియా కప్లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. దాంతో ఈ టోర్నీలోనైనా కోహ్లీ ఫామ్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసి వెయ్యి రోజులు పూర్తయింది. ఆసియాకప్లో పాకిస్తాన్తో మ్యాచ్లోనే కోహ్లీ 71వ సెంచరీ అందుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే టీ20 ఫార్మాట్లో సెంచరీ చేయడం మాములు విషయం కాదు. కాబట్టి విరాట్ కీలక ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. ఇక పాక్తో ఆడబోయే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కెరీర్లో 100వ మ్యాచ్. ఇప్పటివరకు కోహ్లీ 99 టీ20ల్లో 50 సగటుతో 3308 పరుగులు సాధించాడు.

ద్రవిడ్కు కరోనా..
ఈ కీలక టోర్నీ ప్రారంభానికి ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడటంతో అతను జట్టుతో దుబాయ్కి రాలేదు. తదుపరి టెస్ట్ తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో కోలుకున్న తర్వాత ద్రవిడ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ ద్రవిడ్ దూరమైతే.. తాత్కలిక కోచ్గా లక్ష్మణ్ జట్టుకు సేవలందించనున్నాడు.


Click it and Unblock the Notifications












