
పోటుగాడు అనుకుంటే..?
గతేడాది టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో విరాట్ కోహ్లీ సారథ్యంపై వేటు వేసిన బీసీసీఐ.. పోటుగాడంటూ రోహిత్ శర్మను కొత్త కెప్టెన్గా నియమించింది. ఐపీఎల్లో అత్యధిక టైటిల్ గెలిచిన సారథిగా రోహిత్కు అన్ని వర్గాల మద్దతు లభించింది. కూల్ కెప్టెన్, మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకోగలడని, మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో టైటిల్ అందించగలడని అందరూ నమ్మారు. దాంతోనే మూడు ఫార్మాట్ల సారథ్యాన్ని అతనికి అప్పగించారు. కానీ అతను రొటేషన్ పేరిట ఎక్కువ మ్యాచ్లకు సారథ్యం వహించలేదు. అంతేకాకుండా ఆసియాకప్లో అతని కెప్టెన్సీ తీరు అటు అభిమానులను.. ఇటు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

చేసిన తప్పిదాలతోనే..
ఆసియా కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత జట్టును... ఫైనల్ చేరాలంటే ఏం జరగాలి.. ఇతర జట్లు ఎలా ఓడిపోవాలో అని లెక్కలు వేసుకునే స్థితికి తీసుకువచ్చారు. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అసమర్థత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత టోర్నీ గురించి ఆలోచించకుండా టీ20 ప్రపంచకప్ కోసం ఆటగాళ్లను పరీక్షిస్తున్నామని చేసిన ప్రయోగాలు జట్టు కొంపముంచాయి. పాకిస్థాన్పై గెలిచిన జట్టును కొనసాగించకుండా ఎన్నడు లేని విధంగా ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం జట్టు ఓటమికి కారణమైంది.

చేసిన తప్పులే...
పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు జడేజా గాయంతో దూరమవడం టీమ్ కాంబినేషన్ను దెబ్బతీసింది. దాంతో అతని స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్న టీమ్మేనేజ్మెంట్ అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయింది. బ్యాటింగ్లో రిషభ్ పంత్ను తీసుకొచ్చి మూల్యం చెల్లించుకుంది. హార్దిక్ పాండ్యాను బాగా నమ్మిన రోహిత్ను అతను నట్టేట ముంచాడు. రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో భువీ చేత 19వ ఓవర్ వేసి తప్పు చేసిన రోహిత్... శ్రీలంకతోనూ అదే తప్పిదాన్ని పునరావృతం చేశాడు. కెప్టెన్సీలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ తీవ్ర ఒత్తిడికిలోనై తడబడ్డాడు. ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు. శ్రీలంకతో 19వ ఓవర్ అర్షదీప్ సింగ్కు ఇచ్చుంటే ఫలితం మరోలా ఉండేది. పేస్ అంతగా అనుకూలంగా లేని పిచ్పై పవర్ ప్లేలోనే స్పిన్నర్లతో బౌలింగ్ చేయించుకుండా రోహిత్ తప్పిదం చేశాడు.

కొంపముంచిన దూకుడు...
కనీసం పాక్తో ఓటమి అనంతరమైనా బుద్ది తెచ్చుకొని టీమ్ కాంబినేషన్ మార్చకుండా కొత్తగా అశ్విన్ తీసుకొచ్చి మూల్యం చెల్లించుకున్నారు. శ్రీలంకతో నాలుగో పేసర్తో బరిలోకి దిగాల్సింది కదా? అని ప్రశ్నిస్తే ఆవేశ్ ఖాన్ అందుబాటులో లేడని రోహిత్ సాకుగా చెప్పాడు. ఆవేశ్ ఖాన్ కోలుకోకుంటే స్టాండ్బై ఉన్న దీపక్ చాహర్ను తీసుకోవచ్చు కదా? అనే ప్రశ్నకు రోహిత్ వద్ద సమాధానం లేకపోయింది. పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడు మంత్రం జపించడం కూడా జట్టుకు చేటు చేసింది. తగ్గేదేలే అన్నట్లు ఉరుకులాడి టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికైనా రోహిత్ ఎక్కడ తగ్గాలో.. మరెక్కడ దూకుడు కనబర్చాలో అనే విషయం తెలుసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications
