
హైదరాబాద్: ప్రపంచకప్ ఫలితం మొత్తం ఒక ఎత్తు అయితే భారత్, పాకిస్థాన్ రిజల్ట్ మరో ఎత్తు. ఏళ్లకు ఏళ్లుగా ఇరు జట్ల మధ్య మ్యాచ్లు జరగకపోయినా.. ఆడే ఒకే ఒక్క మ్యాచ్తోనే వరల్డ్ క్రికెట్ను ఊపేస్తుంది. రిక్షా కూలీ నుంచి దేశ ప్రధాని వరకు అందరూ ఆసక్తిగా, అంతే ఉత్కంఠతో తిలకిస్తారు. బ్యాట్కు, బాల్కు యుద్దంలా సాగే.. క్రికెట్కే వన్నెతెచ్చే అసలు మ్యాచ్కు సమయం ఆసన్నమైంది.
ఆసియాకప్ వేదికగా ఆగస్టు 28న దాయాదీ దేశాలు తలపడనున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా భారత్, పాక్ జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దీంతో అటు ప్లేయర్లతో పాటు ఇటు ఇరుదేశాల అభిమానుల మధ్య ఇప్పటికే ఓ రకమైన వార్ క్రియేట్ అయ్యింది. ఇక ఆసియాకప్లో పాక్పై భారత్కే మెరుగైన రికార్డు ఉంది.
అయితే గత టీ20 ప్రపంచకప్లో భారత్కు ఊహించని పరాభావం ఎదురైంది. ఈ ఓటమికి రెండింతలు ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా.. అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో పాక్ ఉంది. ఆసియాకప్ మ్యాచ్లన్నీ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్లో ప్రసారం కానున్నాయి. ఆ సంస్థకే చెందిన ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్లో కూడా మ్యాచ్లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. అయితే స్టార్ స్పోర్ట్స్లో మ్యాచ్లు వీక్షించాలంటే తగినంత రుసులు చెల్లించి చానెల్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. హాట్ స్టార్కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే.
ఫ్రీగా చూడాలంటే మాత్రం భారత ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్లో చూడవచ్చు. ఆసియాకప్లో భారత్ ఆడే మ్యాచ్లు డీడీ స్పోర్ట్స్లో కూడా ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఈ చానెల్ను ఫ్రీగా వీక్షించవచ్చు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మొబైల్లో చూడాలనుకుంటే మాత్రం హాట్స్టార్కు డబ్బులు కట్టాల్సిందే. మరో ఆప్షన్ లేదు.
ఇక ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత జట్టు యూఏఈకి చేరుకుంది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో 11 మంది ఇప్పటికే యూఏఈ గడ్డపై అడుగుపెట్టారు. ఈ రోజు అర్థరాత్రి వరకు మిగిలిన ఆటగాళ్లు చేరుకోనున్నారు.