
19 మ్యాచ్ల్లో 17 సార్లు...
2021 టీ20 ప్రపంచకప్ నుంచి తాజా భారత్ X శ్రీలంక మ్యాచ్ వరకు దుబాయ్ ఇంటర్నేషన్ మైదానంలో మొత్తం 19 మ్యాచ్లు జరగగా.. 17 సార్లు చేజింగ్ చేసిన జట్లే విజయాలందుకున్నాయి. రెండు మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. అవి కూడా స్కాట్లాండ్, హాంగ్కాంగ్ వంటి చిన్నదేశాలపై అందుకున్న విజయాలే. టీ20 ప్రపంచకప్లో స్కాట్లాండ్పై న్యూజిలాండ్ 16 పరుగులతో గెలవగా.. తాజాగా ఆసియాకప్లో హాంగ్ కాంగ్ను టీమిండియా 40 పరుగులతో ఓడించింది. ఈ లెక్కలను బట్టే ఇక్కడ టాస్ గెలవడం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.

చేజింగ్కే అడ్వాంటేజ్..
ఇక్కడి పిచ్లు ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయినా చేజింగ్ టీమ్కే అనుకూలంగా ఉంటాయి. తీవ్ర ఉక్కపోత వాతావరణం, డ్యూ ప్రభావం చేజింగ్ టీమ్కు అడ్వాంటేజ్గా మారుతోంది. ఎంతటి పెద్ద లక్ష్యమైనా క్రీజులో ఓపికగా నిలబడితే ఇట్టే కరిగిపోతుంది. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుండటమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఆసియాకప్ 2022లో అఫ్గానిస్థాన్తో తొలి మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో టాస్ గెలిచి విజయాన్నందుకొని ఫైనల్ బెర్త్ ఖారారు చేసుకుంది.

పాక్పై భారత్ సైతం..
భారత్ X పాక్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లోనూ రోహిత్ సేన టాస్ గెలవడం కలిసొచ్చింది. టాస్ గెలిచిన రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకొని పాక్ను సాధారణ స్కోర్కే పరిమితం చేయడం.. ఆ తర్వాత పిచ్ కండిషన్స్ను అడ్వాంటేజ్గా మార్చుకొని విజయం సాధించడం తెలిసిందే. ఇక అదే సూపర్ 4 మ్యాచ్లో పాక్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా.. పాక్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కెప్టెన్లు.. గెలవని సారథులు చెప్పే ఒకే మాట ఫీల్డింగ్ తీసుకోవడం. అంతలా ఏకపక్షంగా మారిన ఈ మైదానంపై నిషేధం విధించడమే ఉత్తమమని క్రికెట్ లవర్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications
