
దుబాయ్: ఆసియా కప్ 2022 పుణ్యమా క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా అందింది. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ ఊహించనట్లుగానే ఫ్యాన్స్కు అసలు సిసలు మజాను అందించింది. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తూ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. లీగ్ దశలో జరిగిన భారత్ X పాక్ మ్యాచ్ కంటే రెండింతల టెన్షన్ పెట్టింది. తూటాలు, తుపాకులు లేని ఈ యుద్దంలో ఈ సారి విజయం పాకిస్థాన్ దక్కగా.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించింది. రికార్డు వ్యూయర్షిప్తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ ఆల్టైమ్ రికార్డు నమోదు చేసింది.
గత భారత్Xపాక్ మ్యాచ్ దెబ్బకు ఐపీఎల్ 2022 సీజన్, టీ20 ప్రపంచకప్ వ్యూయర్షిప్ రికార్డులన్నీ కనుమరుగవ్వగా.. తాజా మ్యాచ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ను డిస్నీ హాట్స్టార్లో గరిష్టంగా కోటీ 40 లక్షల మంది చూశారు. ఇప్పటి వరకు హాట్స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ కోటీ 30 లక్షలు మాత్రమే. ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ వ్యూస్ రాగా.. తాజా మ్యాచ్ ఆ రికార్దును అధిగమించింది. గతేడాది టీ20 ప్రపంచకప్లో భారత్Xపాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు, ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ల్లో కోటీ 20 లక్షల వ్యూస్ రాగా... గత మ్యాచ్ కోటి 30 లక్షల రికార్డును నమోదు చేసింది. హాట్స్టార్లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్పీ రేటింగ్స్లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే.
ఈ సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో అనవసర తప్పిదాలతో టీమిండియా ఓటమిపాలైంది. ముఖ్యంగా కీలక సమయంలో అర్ష్దీప్ సింగ్ చేజార్చిన క్యాచ్ భారత్ కొంపముంచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 60) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28), కేఎల్ రాహుల్(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 28) మెరుపులు మెరిపించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బాబర్ ఆజామ్(51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 42), అసిఫ్ అలీ(16) కీలక పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.