
దుబాయ్: ఆసియాకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రతీ మ్యాచ్లో టాస్ గెలిచి వరుస విజయాలందుకున్న శ్రీలంకకు కీలక మ్యాచ్లో దురదృష్టం వెంటాడింది. టాస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ టోర్నీలో పాకిస్థాన్కు కీలక పోరులో కలిసొచ్చింది. దాంతో ఆ జట్టుకు వెయ్యి రెట్ల బలం వచ్చింది. ఈ మ్యాచ్కు ముందు శ్రీలంకతో జరిగిన ప్రీ ఫైనల్లో పాక్ టాస్ ఓడి 5 వికెట్లతో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన బాబర్ ఆజామ్ ఏ మాత్రం సంశయించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
టాస్ గెలవడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని చెప్పాడు. ఈ టోర్నీలో తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, ప్రతీ మ్యాచ్లో తమకు ఓ మ్యాచ్ విన్నర్ లభించాడని పేర్కొన్నాడు. షాదాబ్, నసీమ్ షా జట్టులోకి తిరిగొచ్చారని, ఉస్మాన్, హసన్ అలీ ఉద్వాసనకు గురయ్యారని పేర్కొన్నాడు.
టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. అయితే ముందు బ్యాటింగ్ చేయడం పట్ల ఏమాత్రం చింతించడం లేదని, మానసికంగా సిద్దమయ్యే బరిలోకి దిగామని చెప్పాడు. ఈ సవాల్ను స్వీకరిస్తున్నామని, ఓపెనర్లు శుభారంభం అందిస్తే.. భారీ స్కోర్ పాక్ ముందు ఉంచుతామని ధీమా వ్యక్తం చేశాడు. మదుషంక, మహీష్ తీక్షణ అద్భుతంగా రాణించారని, టీ20 ప్రపంచకప్ ముందు ఈ విజయాలు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
తుది జట్లు
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమికా కరుణరత్నే, పమ్రోద్ మదుషన్, మహీష్ తీక్షణ, దిల్షాన్ మదుషంక
పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజామ్(కెప్టెన్), ఫకార్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, కుష్దిల్ షా, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్