
దుబాయ్: ఆసియాకప్ 2022 ఆరంభ మ్యాచ్లో అభిమానులకు ఆశించిన ఎంటర్నైట్మెంట్ లభించలేదు. ఏ మాత్రం పసలేకుండా ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఫ్యాన్స్కు బోర్ తెప్పించింది. అసలు మెగా టోర్నీ జరగతుందా? క్వాలిఫయర్ మ్యాచ్లు జరుగుతున్నాయా? అనే సందేహం కలిగింది. శ్రీలంక పేలవ ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. ఆడుతూ పాడుతూ 8 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ భానుక రాజపక్స(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 38), చమిక కరుణరత్నే(38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్ల ధాటికి ముగ్గురు డకౌటయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో సన్రైజర్స్ బౌలర్ ఫజల్లాక్ ఫరూఖీ(3/11) మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ రెండేసి వికెట్లు పడగొట్టారు. నవీన్ ఉల్ హక్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ 10.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి మరో 59 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జాజై(37 నాటౌట్), రహమానుల్లా గుర్బాజ్(40) రాణించారు. లంక బౌలర్లలో ఆర్సీబీ ప్లేయర్ హసరంగాకు ఓ వికెట్ దక్కింది. రేపు అసలు సిసలు సమరం జరగనుంది. భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించనుంది.
ఈ మ్యాచ్లో అంపైర్ల తప్పిదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్ కూడా తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. నవీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్లో అంపైర్ల తప్పిదం కారణంగా పాతుమ్ నిస్సంక(3) పెవిలియన్ చేరాడు. నవీన్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని ఓవర్ మిడాన్ దిశగా పాతుమ్ నిస్సంక ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది.
అఫ్గాన్ ఆటగాళ్లు అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర ఔటిచ్చాడు. ఇక బ్యాట్కు బంతి తాకలేదనే నమ్మకంతో నిస్సంక రివ్యూ తీసుకోగా.. థర్డ్ అంపైర్ సైతం ఔటిచ్చాడు. రిప్లేలో బంతి బ్యాట్ను తాకినట్లు కనిపించలేదు. స్నీకో మీటర్లో కూడా గీత రాలేదు. అయినా థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దాంతో లంక ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఆ జట్టు కోచ్ అయితే తన సైగలతో నిరసన వ్యక్తం చేశాడు.