
దుబాయ్: ఓవైపు కరోనా వైరస్ బీభత్సం.. మరోవైపు ఆతిథ్య శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ఇక జరుగుతుందా? లేదా? అన్న సందేహాల మధ్య ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి తెరలేచింది. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మినీ వరల్డ్కప్ సమరం మొదలవ్వడంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఈ టోర్నీపై ఫోకస్ పెట్టింది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్-శ్రీలంక మధ్య జరగుతుండగా టాస్ గెలిచిన మహమ్మద్ నబీ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.
వికెట్ చాలా ఫ్రెష్గా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అఫ్గాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తెలిపాడు. గత కొన్ని రోజులు ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు జరగలేదని, దాంతో పిచ్ చాలా ఫ్రెష్గా ఉందన్నాడు. అంతేకాకుండా తమ జట్టులో ఆల్రౌండర్లు ఉన్నారని, దాంతోనే చేజింగ్కు మొగ్గు చూపానని చెప్పాడు. ఇక శ్రీలంక కెప్టెన్ డసన్ షనక సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాడినని పేర్కొన్నాడు. కొత్త పేసర్లు పతిరాణా, దిల్షాన్ మదు షంక ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. ఈ మ్యాచ్తో రషీద్ ఖాన్ టీ20ల్లో 100 మ్యాచ్ల మైలు రాయిని అందుకున్నాడు.
అఫ్గానిస్తాన్ టీమ్లో ట్రంప్ కార్డు మాత్రం స్పిన్నర్ రషీద్ ఖానే. ఎలాంటి బ్యాటర్నైనా బోల్తా కొట్టించే సామర్థ్యం అతని సొంతం. ఎక్స్పీరియెన్స్ మహ్మద్ నబీ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ కూడా మెరుగైన పెర్ఫామెన్స్ చేసేందుకు రెడీగా ఉంది. పెద్ద ప్రత్యర్థులపై సంచలన విజయాలు సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది.
కొత్త కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ నేతృత్వంలో శ్రీలంక కూడా ట్రోఫీపై కన్నేసింది. టీమ్లో నైపుణ్యానికి కొదువలేదు. అనామక ప్లేయర్లు కూడా సింగిల్ నైట్లో స్టార్లుగా ఎదగడానికి ఈ టోర్నీ అవకాశంగా ఉండటంతో ప్రతి ప్లేయర్పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
తుది జట్లు:
శ్రీలంక: గుణ తిలక, నిస్సంక, కుశాల్ మెండీస్, అసలంక, రాజపక్స, శనక, హసరంగా, కరుణరత్నే, తీక్షణ, మదుషంక, పతిరాణా
అఫ్గానిస్థాన్: జాజై, గుర్బాజ్, జడ్రాన్, జనత్, ఎన్ జడ్రాన్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఒమర్జై, నవీన్, ఊఆర్ రెహ్మాన్, ఫరూఖీ